బీజేపీ ఆపరేషన్ "స్లమ్".. బండిసేన బిజీ బిజీ!!
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రజల మద్దతు కోసం పడరాని పాట్లు పడుతున్నాయి. ముఖ్యంగా ఈ సారి విజయం సాధించాలన్న సంకల్పంతో ఉన్న బిజెపి, ఒకపక్క ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రజాక్షేత్రంలో ఎండగడుతూనే, బీజేపీ వ్యూహాత్మక అడుగులు వేస్తుంది.
భారతీయ జనతా పార్టీ ఎక్కడ వీక్ గా ఉంది? ఏ ఏరియాల పై ఫోకస్ చేస్తే పార్టీ బలోపేతం అవుతుంది? వచ్చే ఎన్నికలలో ఓటు బ్యాంకు కొల్లగొట్టడానికి చేయవలసింది ఏమిటి? అన్న అంశాలపై దృష్టిసారించింది. అందులో భాగంగా బిజెపి ఒక నయా వ్యూహాన్ని అమలు చేస్తోంది. వచ్చే ఎన్నికల లోపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాల్లోనూ మురికివాడలను సందర్శించే పనిలో బిజెపి నేతలు బిజీగా ఉన్నారు.

స్లమ్ ఏరియాలపై ఫోకస్ చేసి, అక్కడి ప్రజల కష్టాలను తెలుసుకుని, వారికి అండగా తాము ఉన్నామని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు బిజెపి నేతలు. ఇప్పటికే అనేక మురికివాడలలో తాగునీరు సౌకర్యం లేక, కరెంటు లేక, అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. బిజెపినేతలు వారి వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకొని పరిష్కరించడానికి పని చేస్తామని భరోసా ఇవ్వడంతో పాటు, వారివద్ద బీజేపీకి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు.
ఇంటింటికి తిరుగుతూ బిజెపి నేతలు వారి పూర్తి వివరాలను తెలుసుకోవడంతో పాటు, వారి సమస్యలను కూడా తెలుసుకొని, వచ్చే ఎన్నికల సమయానికి మురికివాడల్లోని ఓటర్లను తమ వైపు తిప్పుకోవాలని లక్ష్యంగా పెట్టుకుని పని చేస్తున్నారు. మురికివాడల్లోనే ఓటుబ్యాంకు ఎక్కువగా ఉండటం వల్ల బీజేపీ మురికివాడల పైన ప్రధానంగా ఫోకస్ చేస్తుంది.
తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కు గట్టి షాక్ ఇచ్చి, బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తున్న బీజేపీ ఇప్పటికే ప్రజా గోస, బిజెపి భరోసా, కార్నర్ మీటింగ్లు, బైక్ ర్యాలీలతో ప్రజాక్షేత్రంలోకి వెళుతుంది. మరోపక్క స్లమ్ ఏరియాల పైన కూడా ఫోకస్ చేస్తూ బిజెపి పార్టీని క్షేత్రస్థాయికి తీసుకువెళుతుంది. మరి ఈ ప్రయత్నంలో బీజేపీ ఏ మేరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాల్సిందే.












Click it and Unblock the Notifications