ఈనెల 21 నుంచి తెలంగాణలో bjp ''ఆపరేషన్ ఆకర్ష్''
తెలంగాణలో భారతీయ జనతాపార్టీ ''వేట'' ప్రారంభించింది. ఈనెల 21వ తేదీ నుంచి అన్ని నియోజకవర్గాల్లో టూవీలర్ ర్యాలీలు నిర్వహించబోతున్నారు. దీనికి ''బీజేపీ భరోసా యాత్ర'' అనే పేరు నిర్ణయించారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో పార్టీకి ఎక్కడెక్కడ బలమైన అభ్యర్థులు లేరో అక్కడ ''ఆపరేషన్ ఆకర్ష్'' చేపట్టాలని నిర్ణయించారు. ఈ ఆపరేషన్ విజయవంతమయ్యేవరకు పేర్లు బయటపెట్టకూడదని నిర్ణయించారు. పోడు భూముల సమస్యతోపాటు ధరణి పోర్టల్ కు వ్యతిరేకంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్ లో మౌనదీక్ష చేయబోతున్నారు. హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో బండి అధ్యక్షతన కోర్ కమిటీ సమావేశం జరిగింది. రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి తరుణ్ ఛుగ్ తోపాటు పలువురు నేతలు హాజరయ్యారు.
హైదరాబాద్ వేదికగా భారతీయ జనతాపార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగిన సమయంలో నగరానికి చెందిన నలుగురు బీజేపీ కార్పొరేటర్లను తెలంగాణ రాష్ట్ర సమితి తమ పార్టీలో చేర్చుకుంది. దీనిపై పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఎలాగైనా కేసీఆర్ కు షాక్ ఇవ్వాలనే ఉద్దేశంతో అప్పటినుంచే వ్యూహరచన చేశారు. ''మీరు కార్పొరేటర్లను మాత్రమే చేర్చుకున్నారు.. మేం తలచుకుంటే ఎమ్మెల్యేలనే చేర్చుకోగలమంటూ'' బండి సంజయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇప్పటికే ''ఆపరేషన్ ఆకర్ష్'' ప్రారంభించామని, అంతా అయిన తర్వాత వివరాలు మీకే తెలుస్తాయంటూ హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల్ రాజేందర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా జిల్లాల వారీగా చేరికలకు తెరతీయబోతున్నట్లు తెలుస్తోంది. ఏ జిల్లాకు ఆ జిల్లాలో నాయకులను చేర్చుకుంటూ టీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ కు చెక్ పెట్టాలని బీజేపీ నేతలు నిర్ణయించారు. రానున్న రోజుల్లో ఈ మూడు పార్టీల మధ్య హోరాహోరీ పోరు సాగనున్నట్లు అర్థమవుతోంది.












Click it and Unblock the Notifications