తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ రోడ్ మ్యాప్ సిద్ధం; భవిష్యత్ కార్యాచరణ ఇదే!!
తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ 2023లో జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం రోడ్మ్యాప్ను సిద్ధం చేసింది. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు బీజేపీ అనేక కార్యక్రమాలు చేపడుతోంది. అందులో భాగంగా జులై 21 నుంచి 'పల్లె గోస-బీజేపీ భరోసా' పేరుతో బీజేపీ 15 ప్రాంతాల్లో మోటార్సైకిల్ యాత్ర చేపట్టనుంది.
బైక్ ర్యాలీలతో ప్రతి నియోజకవర్గంలో పర్యటించి బీజేపీ తెలంగాణ ప్రజల కోసం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రచారం చేయడంతో పాటుగా, కేసీఆర్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టడానికి బిజెపి నిర్ణయించింది. అంతేకాదు ప్రజా సంగ్రామ యాత్రకు ప్లాన్ చేస్తుంది.
రానున్న రోజుల్లో తెలంగాణాకు 30మంది కేంద్ర మంత్రులు
ఇక ఈ క్రమంలో బిజెపి భవిష్యత్ కార్యాచరణను తెలంగాణ రాష్ట్ర బిజెపి ఇంచార్జి తరుణ్ చుగ్ వెల్లడించారు. కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పాలనపై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు బిజెపి తెలంగాణ ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ . 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు బిజెపి పూర్తిగా సిద్ధమైందని, బూత్ లెవల్లో పార్టీని బలోపేతం చేసేందుకు కార్యక్రమం కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణకు 30 మంది కేంద్ర మంత్రులు కూడా రానున్నారని తెలిపారు.
తెలంగాణాపై మోడీ ఎఫెక్ట్ ఉందన్న తరుణ్ చుగ్
కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని తెలంగాణ ప్రజలు సంకల్పించారని, అందుకే లక్షలాది మంది తెలంగాణ ప్రజలు ప్రధాని నరేంద్ర మోదీ సభలో పాల్గొన్నారని తరుణ్ చుగ్ అన్నారు. ఇటీవల హైదరాబాద్లో ముగిసిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం కూడా తెలంగాణపై సానుకూల ప్రభావం చూపిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది వచ్చే ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీని గద్దె దించడానికి, బిజెపి విజయం కైవసం చేసుకునేందుకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. తెలంగాణలోని పార్టీ నాయకులు మరియు క్యాడర్లో జోష్ ను పెంచిందని తరుణ్ చుగ్ తెలిపారు.
జులై 21 నుండి ‘పల్లె గోస - బీజేపీ భరోసా' ఆగస్ట్ లో ప్రజా సంగ్రామ యాత్ర
జులై 21న ప్రారంభం కానున్న 'పల్లె గోస - బీజేపీ భరోసా' కార్యక్రమ ర్యాలీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్తో పాటు మరో 30 మంది సీనియర్ నేతలు పాల్గొనే అవకాశం ఉంది. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్తో పాటు మరో 30 మంది నేతలు అవగాహన ర్యాలీలో పాల్గొని, ప్రజలకు కేసీఆర్ ప్రజా వ్యతిరేక పాలన పై అవగాహన కల్పిస్తారు. ఇదిలా ఉంటే ప్రజా సంగ్రామ యాత్ర మూడవ దశ ఆగస్టు 2న ప్రారంభమవుతుంది. యాత్రలో దాదాపు 1000-2000 మంది పాల్గొననున్నట్లు గా తరుణ్ చుగ్ వెల్లడించారు
ప్రజల్లోకి వెళ్లేందుకు బీజేపీ కార్యక్రమాలు
ప్రజా సంగ్రామ యాత్రలో, మొదటి రోజు మూడు-నాలుగు వందల మంది పాల్గొంటారని, గ్రామాల్లో సమస్యలు తెలుసుకునేందుకు నాయకులు నిర్వహించే బైక్ ర్యాలీలలో ప్రతి నియోజకవర్గానికి ఓ కీలక నేత వెళ్లేలా ప్లాన్ చేశారు. మొత్తానికి బీజేపీ వ్యూహాత్మకంగా ప్రజాక్షేత్రంలోకి వెళ్లడానికి అనేక కార్యక్రమాలతో ముందుకు వెళుతోంది. ఎప్పుడు ఎన్నికలు పెట్టినా బీజేపీ సై అంటుంది.