కేటీఆర్ రాజీనామా సవాల్కు బండి సంజయ్ కౌంటర్-రాజీనామా చేయాల్సింది కేసీఆర్ అంటూ...
మంత్రి కేటీఆర్ రాజీనామా సవాల్కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. రాజీనామా చేయాల్సింది కేటీఆర్ కాదు కేసీఆర్ అని అన్నారు. కేసీఆర్ తనతో వస్తే ఢిల్లీకి వెళ్లి ఇద్దరం రాజీనామా చేద్దామని అన్నారు. కేటీఆర్ అజ్ఞాని అని... ఆయనకు రాజ్యాంగం తెలియదని పేర్కొన్నారు. రాష్ట్రం రూపాయి ఆదాయమిస్తే కేంద్రం తిరిగి ఆటానా మాత్రమే ఇస్తోందని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ఈ విషయాన్ని ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. కేటీఆర్ తుపాకీ రాముడి మాటలు ఇక నడవయ్ అని అన్నారు.
బీజేపీని తొక్కేయాలని పగటి కలలు...
అంతకుముందు,మెదక్ జిల్లా పాదయాత్రలో బండి సంజయ్ మాట్లాడుతూ... కేసీఆర్ చేయించిన ఇంటిలిజెన్స్ సర్వేలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయనకు తెలిసిందన్నారు. బీజేపీ పాదయాత్రకు వస్తున్న ప్రజాదరణను టీఆర్ఎస్ ఓర్వలేకపోతున్నదని... బీజేపీని తొక్కేయాలని పగటి కలలు కంటున్నారని విమర్శించారు. ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీకి వంగి వంగి దండాలు పెట్టిన కేసీఆర్... రాష్ట్రానికి రాగానే మోదీని,తనను తిడుతున్నారని మండిపడ్డారు.
రైతు ఆత్మహత్యలకు కేసీఆరే కారణం...
రాష్ట్రంలో ఇటీవలి కాలంలో ఐదుగురు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని... దానికి ముఖ్యమంత్రి కేసీఆరే బాధ్యత వహించాలని సంజయ్ డిమాండ్ చేశారు. వరి వేస్తే ఉరి వేసినట్లేనని సీఎం అనడం వల్లే రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. రైతులకు సీఎం వెంటనే రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వర్షాల కారణంగా రాష్ట్రంలో వరి ఎక్కువగా పండుతోందని... ఆ పంటను కొనడం చేతగాక నెపాన్ని కేంద్రం మీదకు నెడుతున్నారని ఆరోపించారు.రాష్ట్రంలో ఫసల్ భీమా యోజనా పథకాన్ని ఎందుకు అమలుచేయడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఉద్యోగులకు జీతాలే ఇవ్వలేని ప్రభుత్వం దళిత బంధు పేరుతో మరోసారి దళితులను మోసం చేసే కుట్ర చేస్తోందన్నారు. కేంద్ర కేబినెట్లో 27 మంది బీసీలు,12 మంది ఎస్సీలను, 8 ఎస్టీలను, 12 మంది మహిళలను, ఆరుగురు మైనారిటీలను మంత్రులుగా చేశారని.. అన్ని వర్గాలకు కేబినెట్లో చోటు కల్పించారని చెప్పారు.
విమోచనా దినోత్సవాన్ని ఎందుకు జరపట్లేదు...
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే సెప్టెంబర్ 17న అధికారికంగా విమోచన దినోత్సవం నిర్వహిస్తామని చెప్పిన కేసీఆర్... ఆ తర్వాత మాట తప్పారని మండిపడ్డారు. ఆదిలాబాద్ జిల్లాలో ఒకే మర్రిచెట్టుకు 1000 మందిని ఉరితీసిన చరిత్ర నిజాం పాలనది అని గుర్తుచేశారు. ఎంఐఎం నేతలకు భయపడే కేసీఆర్ విమోచనా దినోత్సవాన్ని నిర్వహించట్లేదన్నారు. అందుకే తెలంగాణ విమోచనా దినోత్సవాన్ని గొప్పగా చాటి చెప్పేందుకు నిర్మల్లో ఈ నెల 17న బహిరంగ సభ నిర్వహిస్తున్నామని చెప్పారు. కేంద్రమంత్రి అమిత్ షా ఆ సభకు వస్తారని తెలిపారు.పెద్దోళ్లు చనిపోతే బొకేలు పెట్టి సంతాపం తెలిపే కేసీఆర్... హైదరాబాద్లో వరదలు వచ్చినా,రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా,ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నా స్పందించలేదన్నారు.మూర్ఖుడి పాలనలో ఇంటర్మీడియట్ విద్యార్థులు కూడా ఆత్మహత్య చేసుకున్న దుస్థితి ఉందన్నారు.
కేటీఆర్ ఏమన్నారు...
రాష్ట్రంలో అమలవుతున్న అన్ని పథకాలకు కేంద్రమే నిధులు ఇస్తోందని బండి సంజయ్ ప్రచారం చేయడాన్ని తప్పు పట్టారు.ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్న బీజేపీ బండి సంజయ్... మొత్తం నిధులు కేంద్రానివేనంటూ అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. గత ఆరున్నరేళ్లలో రాష్ట్రం నుంచి కేంద్రానికి అందిన ఆదాయం రూ.2.72లక్షల కోట్లు కాగా... కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చింది కేవలం రూ.1.42లక్షల కోట్లు మాత్రమేనని కేటీఆర్ అన్నారు.తాను చెప్పింది నిజం కాకపోతే తన పదవికి రాజీనామా చేస్తానని... బండి సంజయ్ చెప్పింది అబద్దమైతే ఆయన రాజీనామా చేస్తారా... అని కేటీఆర్ సవాల్ విసిరారు.గద్వాల పర్యటనలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.