మునుగోడులో బీజేపీ వ్యూహం.. అమిత్ షా సభ తర్వాత రాష్ట్ర నాయకులంతా మునుగోడులోనే.. ఎందుకంటే!!
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో మునుగోడు ఉపఎన్నిక అనివార్యంగా మారింది. ఇక మునుగోడు ఉప ఎన్నిక అన్ని రాజకీయ పార్టీలకు కీలకంగా మారడంతో ప్రధాన పార్టీలన్నీ, మునుగోడును హస్తగతం చేసుకోవడం కోసం వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నాయి. ఎవరికివారు మునుగోడులో జెండా ఎగురవేస్తే వచ్చే ఎన్నికలలో దాని ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు.

మునుగోడులో విజయం కోసం గ్రామస్థాయిలో బీజేపీ ప్లాన్
ఇక మునుగోడులో ఉప ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించాలని భావిస్తున్న బిజెపి ఇప్పటికే రాష్ట్ర నాయకత్వానికి మునుగోడు ఉప ఎన్నిక పై దిశానిర్దేశం చేసింది. మునుగోడులో గెలుపే లక్ష్యంగా బిజెపి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రాష్ట్ర నాయకులు అంతా మునుగోడు నియోజకవర్గంలో మోహరించాలని ప్లాన్ చేసింది. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో గ్రామస్థాయిలోకి పార్టీని బలంగా తీసుకువెళ్లాలని, ప్రతి గ్రామంలోనూ ప్రజల మద్దతును కూడగట్టాలని ప్రయత్నం చెయ్యాలని దిశా నిర్దేశం చేసింది.

పార్టీ సీనియర్ నేతలకు ఒక్కొక్కరికి ఆ బాధ్యత
భారతీయ జనతా పార్టీ లోని సీనియర్ నేతలకు ఒక్కొక్కరికి ఐదు గ్రామాల చొప్పున బాధ్యతలు అప్పగించాలని యోచిస్తోంది. ఇక ప్రస్తుతం ప్రజా సంగ్రామ పాదయాత్ర కొనసాగిస్తున్న బండి సంజయ్ సైతం పాదయాత్ర ముగిసిన తరువాత మునుగోడులో మకాం వేస్తానని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవల మండల అధ్యక్షులు, శక్తి కేంద్రాల ఇన్చార్జిల తో మాట్లాడిన సమయంలో ఈ విషయాన్ని బండి సంజయ్ స్పష్టం చేశారు.

బీజేపీ అమిత్ షా సభ .. ఇంటింటికీ వెళ్లి టీఆర్ఎస్ వైఫల్యాలపై బీజేపీ ప్రచారం
ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షాను సైతం రంగంలోకి దింపి మునుగోడు పై బిజెపి ఫోకస్ చేస్తుందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు బిజెపి నాయకులు. ఈనెల 21వ తేదీన కేంద్ర హోం మంత్రి అమిత్ షా సభ జరుగుతుందని సభ తర్వాత బీజేపీ నేతలంతా మునుగోడులోనే మకాం వెయ్యాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అంతేకాదు చేరికలపై కూడా ఫోకస్ చేసిన బిజెపి మరోవైపు ఆ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇక మునుగోడులో ఇప్పటి నుండే ఇంటింటికీ వెళ్లి టిఆర్ఎస్ పార్టీ వైఫల్యాలను ఎండగట్టడం తోపాటుగా, అధికారంలోకి వస్తే చేపట్టే కార్యక్రమాల పై అవగాహన కల్పించడం కోసం యాక్షన్ ప్లాన్ ను సిద్ధం చేశారు బీజేపీ నేతలు.

మునుగోడులో కాంగ్రెస్, టీఆర్ఎస్ లలో పంచాయితీ.. బీజేపీనే వ్యూహాత్మకంగా
మునుగోడు ఉపఎన్నిక మూడు ప్రధాన పార్టీల మధ్య పోటాపోటీగా ఉండనున్న క్రమంలో గతంలో దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికలలోలా ఇప్పుడు కూడా మునుగోడు నస గతం చేసుకోవడానికి పక్కా ప్రణాళికతో బీజేపీ ముందుకు వెళుతుంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ తో పోలిస్తే మునుగోడులో బీజేపీలో ఎలాంటి గొడవలు లేకుండా రాజకీయం కొనసాగుతుంది. ఒక పక్క కాంగ్రెస్ లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రగడ, అంతర్గత కలహాలు కాంగ్రెస్ ను కాస్త ఇబ్బంది పెడుతున్నాయి. ఇక టీఆర్ఎస్ లో పార్టీ టికెట్ కోసం రగడ కొనసాగుతుంది. కానీ బీజేపీలో మాత్రం ఎలాంటి గొడవలకు తావు లేకుండా స్పష్టమైన వైఖరితో పార్టీ ఉప ఎన్నిక వ్యూహాలలో ఉంది.












Click it and Unblock the Notifications