మజ్లిస్ సహా గబ్బు పట్టించారు: కెటిఆర్, టిఆర్ఎస్లోకి బిజెపి మాజీ ఎమ్మెల్యే, టిడిపి నేతలు
హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికలు పురస్కరించుకుని టిఆర్ఎస్లోకి పెద్ద సంఖ్యలో ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు వచ్చి చేరుతున్నారు. శనివారం తెలంగాణభవన్లో జరిగిన కార్యక్రమంలో బిజెపి నేత, మాజీ ఎమ్మెల్యే, ప్రేమ్సింగ్ రాథోడ్, తెలుగుదేశం పార్టీ నేత బండి రమేష్ తదితరులు తమ అనుచరులతో వచ్చి టిఆర్ఎస్లో చేరారు.
వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు టిఆర్ఎస్ మంత్రులు, నేతలు. ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. మన పని మనం చేసుకుంటూ పోతుంటే కాంగ్రెస్ నేతలకు మనసున పడటంలేదని విమర్శించారు. టిఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేస్తుందని మనల్నే విమర్శిస్తున్నారని మండిపడ్డారు.

60ఏళ్ల పాలనలో వారు చేసిన దరిద్రాన్ని 19 నెలల్లో మేం కడిగేయాలన్న విధంగా మాట్లాడటం సరికాదన్నారు. కాంగ్రెస్, మజ్లిస్, టిడిపి మూడు పార్టీలు హైదరాబాద్ మేయర్ పీఠంపై కూర్చుని గబ్బు పట్టించాయని దుయ్యబట్టారు. వాళ్లే మళ్లీ అధికారంలోకి వస్తే ఎలా ఉంటుందో ఓటర్లు ఆలోచించుకోవాలని కోరారు.
బాగా ఆలోచించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నగరాభివృద్ధికి సీఎం కేసీఆర్ వద్ద మంచి ప్రణాళికలు ఉన్నాయని తెలిపారు. ఒక్కసారి అధికారం ఇస్తే అభివృద్ది అంటే ఏంటో చేసి చూపిస్తామని మంత్రి కెటిఆర్ చెప్పారు.
సీమాంధ్రులు మా అన్నదమ్ములే
తెలంగాణ వస్తే హైదరాబాద్లోని సీమాంధ్రులు ఇబ్బందుల పాలవుతారని, చాలామంది ఆరోపించారని టిఆర్ఎస్ పాలనలో అలాంటి ఘటనలు ఏమైనా చోటు చేసుకున్నాయా? అని తెలంగాణ ఐటీ, పంచాయతీరాజ్శాఖ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.
శనివారం ఆయన హైదరాబాద్లోని కొత్తపేటలో మాట్లాడుతూ.. ‘రెండేళ్ల కింద ఏ పరిస్థితి ఉంది? ఇప్పుడు ఎలా ఉందో ఆలోచించండి. మాది స్టేట్ ఫైట్ కానీ, స్ట్రీట్ ఫైట్ కాదని ఆరోజే చెప్పాం. ప్రాంతాల్లా విడిపోయినా అన్నదమ్ముల్లా కలిసి ఉంటున్నాం. సీఎం కేసీఆర్ తెలంగాణ, హైదరాబాద్ అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారు' అని తెలిపారు.
‘టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే వృద్ధులకు పింఛన్లు పెరిగాయి. ఈరోజు నాగోలులో ఓ వృద్ధురాలిని కలిశా. పింఛన్లు, రేషన్ అన్నీ సక్రమంగా అందుతున్నాయని, ఇంట్లో కూడా తనని బాగా చూసుకుంటున్నారని ఆమె చెప్పింది. ఇదంతా తన పెద్ద కుమారుడు కేసీఆర్ వల్లేనని ఆమె ఆనందం వ్యక్తం చేసింది' అని కేటీఆర్ చెప్పారు.












Click it and Unblock the Notifications