రేవంత్ కు బీజేపీ థాంక్స్ : ఢిల్లీ లెక్కలే తెలంగాణలో- పవర్ పక్కా అంటూ..!!
తెలంగాణ లో రాజకీయాలు అనూహ్య మలుపులు తీసుకుంటున్నాయి. మరో పది నెలల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల కోసం ఇప్పటికే టీఆర్ఎస్ వర్సస్ బీజేపీగా రాజకీయం వేడెక్కుతోంది. కాంగ్రెస్ ఏ స్థాయిలో ప్రభావితం చూపిస్తుందనే లెక్కల పైన చర్చలు ఉండేవి. కానీ, కాంగ్రెస్ బరిలో దిగకముందే నేతలు వారిని వారే ఓడించుకుంటున్నారు. ఓటర్లు కనీసం వారి గురించి ఆలోచించే ఛాన్స్ లేకుండా చేసుకుంటున్నారు. దీంతో, బీజేపీకి కాలం కలిసి వచ్చేలాఉంది. ఇక పోరు టీఆర్ఎస్ వర్సస్ బీజేపీ అన్నట్లుగా ఎన్నికల్లో ఉండే అవకాశం ఉందనే అంచనాలు మొదలయ్యాయి.

టార్గెట్ రేవంత్ -ఏం జరగబోతోంది
తెలంగాణలో ఎన్నో అంచనాలతో రేవంత్ కు టీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు అప్పగించారు. కాంగ్రెస్ రాజకీయాలు పూర్తిగా అర్దం చేసుకోలేకపోయిన రేవంత్.. సీనియర్ల తీరుతో ఆత్మరక్షణలో పడ్డారు. ఢిల్లీలో మేనేజ్ చేసుకుంటే చాలని భావించి..హైదరాబాద్ లో ఇబ్బందులు పడుతున్నారు. తనతో పాటుగా టీడీపీ నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇచ్చేందుకు తీసుకున్న నిర్ణయాలతో కాంగ్రెస్ సీనియర్లు రాజీ పడటం లేదు. తామే అసలైన కాంగ్రెస్ అంటున్నారు. వలసవాదులు వర్సస్ ఒర్జినల్ కాంగ్రెస్ గా డివిజన్ తెచ్చారు. సేవ్ కాంగ్రెస్ అంటూ నినదించారు. దీంతో, వచ్చే ఎన్నికల్లో రేవంత్ సారధ్యంలో కాంగ్రెస్ ఎన్నికలకు వెళ్తుందా..వెళ్లినా వీరంతా సహకరిస్తారా..హైకమాండ్ బుజ్జగించినా మనస్పూర్తిగా రేవంత్ నాయకత్వంలో పని చేస్తారా అనేది సందేహమే. రేవంత్ ను మార్చి కొత్త అధ్యక్షుడిని తీసుకొస్తే ఎన్నికల వేళ పార్టీకి మొత్తంగానే నష్టం కలిగే అవకాశం ఉంది.

త్రిముఖ పోటీ.. రెండు పార్టీలుగా మారుతోందా
మరో పది నెలల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. టీఆర్ఎస్ హ్యాట్రిక్ ఖాయమని చెబుతోంది. కాంగ్రెస్ ఎన్నికల సమయానికి పుంజుకుంటుందని..ప్రజల్లో ఉన్న అనుకూలత ఓట్లుగా మారుతాయని ఆ పార్టీ నేతలు చెబుతూ వచ్చారు. తాజాగా జరిగిన ఉప ఎన్నికల్లో అనూహ్యంగా బీజేపీ పుంజుకుంటూ టీఆర్ఎస్ కు పోటీగా నిలుస్తోంది. కాంగ్రెస్ కు డిపాజిట్లు కష్టంగా మారుతున్నాయి. ఈ సమయంలో ఎన్నికల వేళ కాంగ్రెస్ లో నియమించిన కమిటీలు కాక పుట్టిస్తున్నాయి. మొత్తంగా సీనియర్లు రేవంత్ పైన తిరుగుబాటు కు కారణమయ్యాయి. పీసీసీ ఏ సమావేశాలు నిర్వహించినా తాము రాబోమని సీనియర్లు తేల్చి చెబుతున్నారు. ఢిల్లీ పర్యటనకు సిద్దం అవుతున్నారు. ఈ పరిణామాలతో అసలు ఎన్నికల సమయానికి కాంగ్రెస్ పరిస్థితి ఏంటనే చర్చ మొదలైంది. త్రిముఖ పోటీ తప్పదని భావిస్తున్న వేళ..ఇది రెండు పార్టీల పోరుగా మారుతుందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

బీజేపీ కోరుకున్నదే జరుగుతోందా
తెలంగాణలో కాంగ్రెస్ - టీఆర్ఎస్ మధ్య పొత్తు ఉంటుందంటూ బీజేపీ కొంత కాలంగా ప్రచారం చేస్తోంది. అటు టీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ నేతలు పొత్తు ప్రసక్తే లేదని స్పష్టం చేస్తున్నారు. వాస్తవంగా కాంగ్రెస్ రేసులో ఉండాలని టీఆర్ఎస్ కోరుకుంటోంది. దీని ద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటు నేరుగా బీజేపీకి వెళ్లకుండా కాంగ్రెస్ చీల్చుతుందనేది గులాబీ పార్టీ నేతల అంచనా. ఫలితంగా రెండు పార్టీలు ఇతర పార్టీలతో కలిసి తమతో బరిలోకి దిగటం ద్వారా తమ పాజిటివ్ ఓటుతో తిరిగి అధికారంలోకి వస్తామనేది టీఆర్ఎస్ నేతల విశ్లేషణ. ఇదే విధంగా బీజేపీ నేతలు కాంగ్రెస్ అంతర్గత సమస్యలతో డీలా పడితే.. నేరుగా ఫైట్ టీఆర్ఎస్ బీజపీ మధ్యనే ఉంటుందని.. పదేళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమను ప్రజలు ఆదరిస్తారని కమలం పార్టీ నేతలు విశ్వసిస్తున్నారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ నాయకత్వ సమస్య బీజేపీకి వరంగా మారుతోంది. తెలంగాణలోనూ అదే జరుగుతోంది. దీంతో, కాంగ్రెస్ పరిణామాలను సొంత పార్టీ నేతలకంటే టీఆర్ఎస్ - బీజేపీ నేతలు ఆసక్తిగా గమనిస్తున్నారు.












Click it and Unblock the Notifications