బ్లాక్ ఫంగస్-కోఠి ఈఎన్టీలో తొలి మరణం?-ఖండించిన సూపరింటెండెంట్-అసలు కారణమిదే..
హైదరాబాద్లో బ్లాక్ ఫంగస్(మ్యుకోర్మైకోసిస్) కేసులకు నోడల్ కేంద్రంగా ఉన్న కోఠి ఈఎన్టీ ఆస్పత్రిలో ఈ వ్యాధి కారణంగా తొలి మరణం సంభవించినట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన శ్రీనివాస్(50) అనే వ్యక్తి బ్లాక్ ఫంగస్కి ఇక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం. అయితే ఆస్పత్రి యాజమాన్యం మాత్రం శ్రీనివాస్ గుండెపోటుతో చనిపోయాడని చెబుతుండటం గమనార్హం. దేశంలో కోవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్న వేళ బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

ఎవరా పేషెంట్....
శ్రీనివాస్ అనే వ్యక్తి బ్లాక్ ఫంగస్ బారినపడి మే 30వ తేదీన కోఠి ఈఎన్టీ ఆస్పత్రిలో చేరాడు. వైద్యులు అతనికి మెరుగైన చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమించడంతో మంగళవారం(జూన్ 1) ఉదయం 11గంటలకు అతను మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించి మృతదేహాన్ని అప్పగించారు. శ్రీనివాస్ మృతితో కోఠి ఈఎన్టీ ఆస్పత్రిలో బ్లాక్ ఫంగస్తో తొలి మరణం నమోదైనట్లయింది.

గుండెపోటే కారణం... : సూపరింటెండెంట్
కోఠి ఈఎన్టీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.శంకర్ శ్రీనివాస్ మృతిపై స్పందిస్తూ... అతను గుండెపోటుతో చనిపోయినట్లు చెప్పారు. బ్లాక్ ఫంగస్ కారణంగా అతను చనిపోలేదన్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బ్లాక్ ఫంగస్ పేషెంట్లందరికీ మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు. ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితిని గమనిస్తూ తగిన చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. పేషెంట్లు,వారి కుటుంబ సభ్యులకు ఎటువంటి ఆందోళన అక్కర్లేదని స్పష్టం చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా 1500 పడకలు
కోఠి ఈఎన్టీ ఆస్పత్రిలో బ్లాక్ ఫంగస్ పేషెంట్ల కోసం 230 పడకలను ఏర్పాటు చేశారు. అలాగే గాంధీ ఆస్పత్రిలో 150 పడకలు ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1500 పడకలు బ్లాక్ ఫంగస్ పేషెంట్ల కోసం అందుబాటులోకి తీసుకురావాలని గత వారం సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.ఈ చికిత్సకు అవసరమైన నిపుణులను కూడా నియమించుకోవాలన్నారు. అవసరమైన మందులు,ఇంజెక్షన్లు తెప్పించుకోవాలని అధికారులను ఆదేశించారు.

హైకోర్టులో బ్లాక్ ఫంగస్ కట్టడి చర్యలపై పిటిషన్
బ్లాక్ ఫంగస్ నివారణకు ప్రభుత్వం కట్టడి చర్యలు చేపట్టాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. న్యాయవాది జయంత్ జయసూర్య ఈ పిటిషన్ను దాఖలు చేశారు. లైపోసోమల్ ఆంఫోటెరిసిన్-బి ఇంజెక్షన్లను అందుబాటులో ఉంచుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని... ఈ మేరకు హైకోర్టు ఆదేశాలివ్వాలని కోరారు. బ్లాక్ ఫంగస్ వలన ప్రజలు తీవ్ర భయబ్రాంతులకు గురవుతున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. ప్రభుత్వం బ్లాక్ ఫంగస్పైన దృష్టి సారించి ప్రజల ప్రాణాలు కాపాడే విధంగా చూడాలని పిటిషనర్ కోరారు. ఈ పిటిషన్పై నేడు హైకోర్టు విచారించనుంది.
Recommended Video

బ్లాక్ ఫంగస్ లక్షణాలు
కోవిడ్ చికిత్స సమయంలో పేషెంట్లకు అధిక మోతాదులో స్టెరాయిడ్స్ ఇవ్వడం వల్లే బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ సోకుతోందన్న వాదన వినిపిస్తోంది. గత నెలలో గుజరాత్లో 40 బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ కేసులు బయటపడిన సంగతి తెలిసిందే. కరోనా నుంచి కోలుకున్నవారిలో ఈ లక్షణాలు కనిపించాయి. ఇన్ఫెక్షన్ సోకినవారిలో కొందరు కంటిచూపు కూడా కోల్పోయారు. బ్లాక్ ఫంగస్కి చికిత్స ఉందని... అయితే చికిత్స ఆలస్యమైనా,చికిత్స తీసుకోకపోయినా ప్రాణానికే ప్రమాదమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఇన్ఫెక్షన్ సోకినవారిలో ర్మంపై మంట రావడం,చర్మం చిట్లిపోవడం,జ్వరం,దగ్గు,ఛాతి నొప్పి,శ్వాస సమస్యలు వంటి లక్షణాలు కనిపిస్తాయని చెబుతున్నారు. కంటి చుట్టూ కండరం బిగుసుకుపోయి అంధత్వం వచ్చే ప్రమాదం ఉంటుందని.. ఈ ఫంగస్ ముక్కు నుంచి మెదడుకు చేరితే మరణం సంభవిస్తుందని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications