కృష్ణా ఎక్స్ప్రెస్ రైలుకు బాంబు బెదిరింపు... పరుగులు పెట్టిన రైల్వే పోలీసులు; ట్విస్ట్ ఏమిటంటే!!
కృష్ణ ఎక్స్ ప్రెస్ ట్రైన్ కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తి కృష్ణ ఎక్స్ప్రెస్ లో బాంబు పెట్టారని 100 నెంబర్ కు కాల్ చేసి చెప్పడంతో ఒక్కసారిగా కలకలం మొదలైంది. ఒక పక్కన దేశ రిపబ్లిక్ డే వేడుకలకు రెడీ అవుతున్న వేళ కృష్ణ ఎక్స్ప్రెస్ రైలులో బాంబు పెట్టారని వచ్చిన కాల్ రైల్వే పోలీసులను, సివిల్ పోలీసులను పరుగులు పెట్టించింది. ఇక ఇంతకీ ఏం జరిగిందంటే..

కృష్ణా ఎక్స్ ప్రెస్ కు బాంబు బెదిరింపు కాల్ ..
తిరుపతి ఆదిలాబాద్ మధ్య నడిచే కృష్ణ ఎక్స్ప్రెస్ రైలులో బాంబు పెట్టారని గుర్తు తెలియని వ్యక్తి హైదరాబాద్ కంట్రోల్ రూమ్ కు కాల్ చేశారు. ఆ ఫోన్ కాల్ వచ్చిన వెంటనే అప్రమత్తమైన అధికారులు కృష్ణ ఎక్స్ప్రెస్ రైలును మౌలాలిలో ఆపి తనిఖీలు నిర్వహించారు. బాంబు స్క్వాడ్ రంగంలోకి దిగి రైలు అంతా తనిఖీలు చేసింది. మౌలాలి వద్ద రైలును డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్లతో క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత అందులో ఎటువంటి బాంబు లేదని రైల్వే పోలీసులు, పోలీసులు తేల్చారు. బాంబు బెదిరింపు కాల్ వల్ల కృష్ణ ఎక్స్ప్రెస్ 2 గంటలు ఆలస్యంగా నడిచింది.

చేసింది రైల్లోని వ్యక్తే ... కారణం ఇదే
ఇంతకీ తమకు బాంబు బెదిరింపు కాల్ చేసిన వ్యక్తి ఎవరు? అన్నదానిపై కాల్ డేటా ఆధారంగా వివరాలు సేకరించిన పోలీసులు చివరికి రైల్లో ఉన్న కిరణ్ అనే వ్యక్తి కాల్ చేసినట్టుగా గుర్తించి అతనిని అరెస్ట్ చేశారు. రైల్వే పోలీసులు కిరణ్ ను ప్రశ్నించగా అతను ఆసక్తికరమైన సమాధానం చెప్పారు. రైల్లో భువనగిరి నుంచి వస్తున్న క్రమంలో బాత్రూంలోకి వెళ్లి తను 100 నెంబర్ కు ఫోన్ చేసి చెప్పానని, రైల్లో ఉన్నవాళ్లంతా తనకు టెర్రరిస్టులు లాగా కనిపించారని కిరణ్ వెల్లడించాడు. కిరణ్ మానసిక ఆరోగ్యం సరిగా లేదని, ఎస్ఐ పరీక్ష రాసి ఫెయిల్ అయిన కిరణ్ అనే నిరుద్యోగి మానసికంగా కృంగిపోయాడని, డిసెంబర్ నెలలో ఎస్ఐ ఈవెంట్స్ లో ఫెయిల్ అయిన తర్వాత కిరణ్ విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడని తండ్రి చెప్పారు.

రిపబ్లిక్ డే వేడుకలకు రెడీ అవుతున్న వేళ బాంబు బెదిరింపు కలకలం
అతనికి తలకు గాయం అయిందని, అందువల్ల అతను మతిస్థిమితం కోల్పోయి, ఇలా ప్రవర్తించి ఉంటాడని అతని తండ్రి పోలీసులకు తెలిపాడు. మతిస్థిమితం లేని వ్యక్తి కాల్ చేసిన నేపథ్యంలో, అసలు బాంబు బెదిరింపు లాంటి ఘటన చోటు చేసుకోలేదని పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఇంకా రిపబ్లిక్ డే అయిదు రోజుల సమయం ఉండడం, రిపబ్లిక్ డే ను టార్గెట్ చేసి ఉగ్రవాదులు శాంతి భద్రతల విభాగానికి పాల్పడే అవకాశం ఉండడం వంటి కారణాలతో దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. ఇక ఇదే సమయంలో వ్యక్తి చేసిన ఫోన్ కాల్ ఒక్కసారిగా అందరిని ఉరుకులు పరుగులు పెట్టించింది. ఎక్కడ ఎటువంటి బాంబులు లేకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.












Click it and Unblock the Notifications