కేసీఆర్ దేశ పర్యటనకు బ్రేక్.. హైదరాబాద్ కు తిరిగొచ్చిన సీఎం; కారణాలివేనా? హాట్ టాపిక్!!
వారం రోజుల పాటు ఢిల్లీ కేంద్రంగా రాజకీయ పర్యటనలు చేయాలని, దేశ రాజకీయాలలో సంచలనాలు సృష్టించాలని షెడ్యూల్ ఖరారు చేసుకొని మరీ వెళ్లిన టిఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ హఠాత్తుగా హైదరాబాద్ కు రిటర్న్ అయ్యారు. సీఎం పర్యటనలో షెడ్యూలు చేసుకున్న అన్ని రాష్ట్రాలకు వెళ్లక ముందే కెసిఆర్ హైదరాబాద్ కు తిరిగి వచ్చారు. దీంతో కెసిఆర్ తీసుకున్న అనూహ్య నిర్ణయం పట్ల రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
షెడ్యూల్ పూర్తి కాకముందే హైదరాబాద్ కు కేసీఆర్
తెలంగాణ సీఎం కేసీఆర్ వారం రోజుల పాటు దేశ పర్యటనకు వెళ్లారు. ఇందులో భాగంగా ఆయన ఢిల్లీలో అఖిలేష్ యాదవ్ తో భేటీ అయ్యారు. ఇక కేజ్రీవాల్ తోనూ భేటీ నిర్వహించి మంతనాలు జరిపారు. ఢిల్లీ, పంజాబ్ లో కార్యక్రమాలలో పాల్గొని ఆ తర్వాత కర్ణాటక రాష్ట్రానికి కెసిఆర్ వెళ్ళవలసి ఉంది. అయితే కెసిఆర్ పంజాబ్ రైతులకు సహాయం చేసి కార్యక్రమాన్ని ముగించి తిరిగి హైదరాబాద్ కు వచ్చారు. ఎంతో ఉత్సాహంగా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతామని, సంచలనాలు సృష్టిస్తామని చెప్పిన కేసీఆర్ షెడ్యూల్ కంటే ముందే తిరిగి రావడంపై రాజకీయవర్గాలలో ఆసక్తి నెలకొంది.
రాష్ట్రంలో కేసీఆర్, కేటీఆర్ ఇద్దరూ లేకుంటే కష్టం అన్న భావనతోనే తిరిగొచ్చారా?
కెసిఆర్ ఢిల్లీ రాజకీయాల్లో బిజీగా ఉండటం, మంత్రి కేటీఆర్ కూడా రాష్ట్రంలో లేకపోవడం, దావోస్ లో పెట్టుబడుల సదస్సులో పాల్గొనడానికి కేటీఆర్ వెళ్లడంతో, తెలంగాణలో రాజకీయ పరిస్థితులు వ్యతిరేకంగా మారే అవకాశం ఉన్నాయన్న ఉద్దేశంతో కెసిఆర్ అర్ధాంతరంగా తన పర్యటనను ముగించుకొని వెనక్కు వచ్చినట్లుగా భావిస్తున్నారు. కేటీఆర్ దావోస్ పర్యటన నేపథ్యంలో కేటీఆర్ తో పాటు రాష్ట్ర పాలనా యంత్రాంగం లోని పలు కీలక అధికారులు కూడా వెళ్లారు. ఈ క్రమంలో రాష్ట్రంలో పాలన పడకేసింది అన్న అభిప్రాయం వ్యక్తమౌతుంది.
కేసీఆర్ దేశ పర్యటనలో రెస్పాన్స్ సరిగా లేదా? చర్చ
ఇక ఇదే సమయంలో ప్రతిపక్ష పార్టీలు టిఆర్ఎస్ పార్టీ కి చెక్ పెట్టడానికి చాపకింద నీరులా ప్రయత్నాలు సాగిస్తున్నాయి. ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రజల మద్దతును కూడగట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ఇక మరోవైపు కెసిఆర్ ఢిల్లీ పర్యటన లో ఇప్పటివరకు జరిగిన భేటీలలో ఆయన అనుకున్న ఫలితాలు రావడంలేదని సమాచారం. ప్రాంతీయ పార్టీల నేతలు కెసిఆర్ ప్రతిపాదనలను ఆమోదించే విషయంలో కాస్త తటపటాయిస్తున్నారు అన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
కెసీఆర్ కేజ్రీవాల్ భేటీ.. కేసీఆర్ కు కేజ్రీవాల్ అనుకూలంగా లేరేమో!! కారణాలు ఇవే
కెసీఆర్ ను చాలా రాజకీయ పార్టీలు నమ్మే స్థితిలో లేవు. ఇక కేజ్రీవాల్ తో భేటీ కూడా సానుకూలంగా కలిసికట్టుగా పోరాడే దిశగా సాగి ఉండకపోవచ్చు అన్న అభిప్రాయం ఉంది. తెలంగాణాలో ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చే ఎన్నికల్లో పోటీ చెయ్యాలని, తెలంగాణాపై దృష్టి సారిస్తున్న సమయంలో కేజ్రీవాల్ కేసీఆర్ తో భేటీలో అంతగా రెస్పాండ్ అయ్యి ఉండకపోవచ్చు అన్న చర్చ జరుగుతుంది. అసలు కెసిఆర్ వ్యూహం ఏంటో సదరు రాజకీయ పార్టీలకు అర్థం కాకపోవడం కూడా ఒక కారణంగా కనిపిస్తుంది.
రాష్ట్రపతి ఎన్నికల్లో కేంద్రంతో తలపడటానికి సిద్ధంగా లేని ప్రాంతీయ పార్టీలు
ఇక రాష్ట్రపతి ఎన్నికలను జాగ్రత్తగా గమనించాలన్న ఉద్దేశ్యం తప్ప, కేంద్రంతో పంచాయితీ పెట్టుకోవటానికి చాలా రాజకీయ పార్టీలు ఆసక్తి చూపటం లేదు. చాలా ప్రాంతీయ పార్టీలకు రాష్ట్రపతి ఎన్నికలలో ప్రతిపక్ష పార్టీలు గా ఎలాంటి వ్యూహాలలోనూ భాగస్వామ్యం తీసుకోకూడదు అని భావిస్తున్నాయి. ఈ కారణాలతో కేసీఆర్ పర్యటన లో ఆయన అనుకున్న రెస్పాన్స్ రాలేదని కూడా చర్చ జరుగుతుంది.
కేసీఆర్ పర్యటన ఆగిపోవటం వెనుక ఆయన ప్లాన్ సక్సెస్ కాకపోవటం కారణమా?
ఏదేమైనా అనేక కారణాల నేపథ్యంలో కేసీఆర్ పర్యటన మధ్యలోనే ఆగిపోయిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాను, కేంద్రంలో పై పట్టు సాధించటం ఒక లెక్క అన్న రీతిలో కేంద్ర ప్రభుత్వం పై దూకుడుగా ముందుకు వెళ్తున్న సీఎం కేసీఆర్ త్వరలో సంచలనం సృష్టిస్తాం అని పేర్కొన్నారు. మరి కెసిఆర్ సృష్టించబోయే సంచలనం ఏంటి అన్నది పక్కన పెడితే, కెసిఆర్ జాతీయ రాజకీయాలలో చేసుకుంటున్న ప్లాన్ పెద్దగా సత్ఫలితాలను ఇవ్వడం లేదు అన్నది మాత్రం రాజకీయవర్గాలలో ప్రధానంగా జరుగుతున్న చర్చ.