స్వీపర్ పోస్టుకు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జీహెచ్ఎంసీ డీఈ
హైదరాబాద్: జీహెచ్ఎంసీ కాప్రా సర్కిల్ డీఈ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులకు చిక్కారు. స్వీపర్ నుంచి లంచం తీసుకుంటూ అధికారులకు పట్టబడ్డారు. ఇటీవల జీహెచ్ఎంసీ మహిళా స్వీపర్ సాలెమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె ఉద్యోగం భర్తకు ఇచ్చేందుకు డీఈ మహాలక్ష్మి లంచం అడిగారు.
మల్లాపూర్లోని ఓ హోటల్లో రూ. 20 వేలు లంచం తీసుకుంటూ ఆమె ఏసీబీకి చిక్కారు. ఈ నేపథ్యంలో డీఈ మహాలక్ష్మి నివాసంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు గుర్తించినట్లు సమాచారం.

పీఎఫ్ రాదన్న బెంగతో మహిళ ఆత్మహత్య
ఉద్యోగం పోవడంతోపాటు తన పీఎఫ్ డబ్బులు రావనే బెంగతో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిలింనగర్ గౌతంనగర్ సామాజిక భవనం సమీపంలో నివసించే సంగీత(45) అపోలో ఆస్పత్రిలోని ఏఆర్ఐ కార్యాలయంలో హౌజ్ కీపింగ్ విభాగంలో పనిచేస్తోంది. ఎనిమిదేళ్ల క్రితం ఆమె భర్త అనారోగ్యంతో మృతి చెందాడు. కుమారుడితో కలిసి ఉంటోంది.
అయితే, ఐదేళ్లుగా ఉద్యోగం చేస్తున్న ఆమెను ఏడాది క్రితం ఉద్యోగం నుంచి తొలగించారు. దీంతో తన పీఎఫ్ గురించి కార్యాలయానికి వెళ్లి విచారిస్తున్నా ఫలితం ఉండటం లేదు. ఆమెకు ఎవరూ సమాధానం చెప్పకపోవడంతో అదే మనసులో పెట్టుకుని అనారోగ్యం బారినపడింది. మానసికంగా తీవ్ర వేదనకు గురైన సంగీత.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో మే 28న ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఆమెను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. పీఎఫ్ రాదనే వేదనతోనే తాను ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులకు ఆమె వాంగ్మూలం ఇచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications