లంచం ఎందుకన్నందుకు పోలీసులతో కొట్టించిన మహిళా ఏవో: పాడైన యువకుడి కిడ్నీలు
లంచం ఎందుకివ్వాలని ప్రశ్నించిన యువకుడిని పోలీసులతో కొట్టించారు ఓ మహిళా వ్యవసాయాధికారి. బాధితుడి కుటుంబ సభ్యులు జిల్లా ఎస్పీ అన్నపూర్ణకు సోమవారం ఫిర్యాదు చేయడంతో వికారాబాద్ జిల్లా మోమిన్పేటలో జరిగిన
వికారాబాద్: లంచం ఎందుకివ్వాలని ప్రశ్నించిన యువకుడిని పోలీసులతో కొట్టించారు ఓ మహిళా వ్యవసాయాధికారి. బాధితుడి కుటుంబ సభ్యులు జిల్లా ఎస్పీ అన్నపూర్ణకు సోమవారం ఫిర్యాదు చేయడంతో వికారాబాద్ జిల్లా మోమిన్పేటలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
వికారాబాద్ మండలం ఎర్రవల్లికి చెందిన పెండ్లిమడుగు కన్నారెడ్డి బీటెక్ పూర్తిచేశారు. మోమిన్పేటలో ఎరువులు, క్రిమిసంహారక మందుల దుకాణం ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. షాపు అనుమతి కోసం మండల వ్యవసాయాధికారిణి(ఏవీ) నీరజకు దరఖాస్తు చేసుకున్నారు.
అనుమతి(లైసెన్స్) మంజూరు చేయకుండా రెండు నెలలు జాప్యం చేసిన అధికారి.. చివరకు రూ.20 వేలు లంచం అడిగినట్లు కన్నారెడ్డి తెలిపారు. ఆమెపై ఫిర్యాదు చేసేందుకు ఏసీబీని ఆశ్రయించగా ఆధారాలుంటే ఇవ్వాలని అధికారులు సూచించారు.
ఈ క్రమంలో ఏవో నీరజతో తన షాపు అనుమతి కోసం మరోసారి సంప్రదించారు కన్నారెడ్డి. అప్పుడు కూడా లంచం అడగడంతో కన్నారెడ్డి తన ఫోన్లో రికార్డు చేసేందుకు ప్రయత్నించాడు. ఇది గమనించిన నీరజ.. తన భర్తకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చింది. ఆ తర్వాత కన్నారెడ్డి ఫోన్ ధ్వంసం చేసి.. తనను వేధిస్తున్నాడని ఏవో నీరజ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఆమె ఫిర్యాదు మేరకు.. మోమిన్పేట ఎస్ఐ రాజు వారం క్రితం పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. వ్యవసాయాధికారిణి, ఆమె భర్త సమక్షంలోనే చితకబాదారు. అనంతరం అనారోగ్యానికి గురైన కన్నారెడ్డిని హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించగా అక్కడి వైద్యులు రెండు మూత్రపిండాలు పాడయ్యాయని నిర్ధారించారు.
పోలీసులు కొట్టడం, వారు కొట్టిన దెబ్బలు తగ్గేందుకు కన్నారెడ్డి పెయిన్ కిల్లర్స్ వాడటంతో అతని కిడ్నీలు పనిచేయకుండా అయ్యాయని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఇప్పటికే రెండు సార్లు డయాలసిస్ చేశామని చెప్పారు.
ఈ క్రమంలో జిల్లా ఎస్పీకి బాధితుడి బంధువులు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఘటనపై ఎస్పీ విచారణకు ఆదేశించారు. ఈ మేరకు వికారాబాద్ డీఎస్పీ స్వామి కన్నారెడ్డిని ఆస్పత్రిలో విచారించారు. నివేదిక త్వరలో ఎస్పీకి సమర్పిస్తానని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. కాగా, తన వాదన వినకుండా ఏవో నీరజ ఇచ్చిన ఫిర్యాదుతో తనను పోలీసులు తీవ్రంగా కొట్టారని కన్నారెడ్డి వాపోయాడు.