వరుడు షాక్ ఇవ్వడంతో అర్థాంతరంగా వివాహ రద్దు: వధువు ఆత్మహత్య..
పచ్చలనడికుడ గ్రామానికి చెందిన మానసకు బాల్కొండ మండలం వన్నెల్.బి గ్రామానికి చెందిన వాల్గోట్ రాజ్కుమార్కు 10 రోజుల క్రితం వివాహ నిశ్చితార్థం జరిగింది.
నిజామాబాద్: వివాహం అర్థాంతరంగా రద్దయిపోవడంతో ఓ వధువు ఆత్మహత్యకు పాల్పడింది. నిజామాబాద్ జిల్లా వేల్పూర్లో ఈ సంఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. పచ్చలనడికుడ గ్రామానికి చెందిన మానసకు బాల్కొండ మండలం వన్నెల్.బి గ్రామానికి చెందిన వాల్గోట్ రాజ్కుమార్కు 10 రోజుల క్రితం వివాహ నిశ్చితార్థం జరిగింది. వివాహం సందర్భంగా వరుడికి రూ.6.5లక్షలను కట్నంగా ఇవ్వడానికి వధువు కుటుంబం అంగీకరించింది.
ఇందులో భాగంగా మానస కుటుంబ సభ్యులు రూ.3లక్షలు ముందస్తుగానే చెల్లించారు. ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం బుధవారం నాడు వీరి వివాహం జరగాల్సి ఉంది. అయితే తీరా వరుడు షాక్ ఇవ్వడంతో కథ అడ్డం తిరిగింది.
మానసను పెళ్లి చేసుకోనంటూ వరుడు మొండికేశాడు. వధువు తల్లిదండ్రులు, బంధువులు, పోలీసులు ఎంత నచ్చజెప్పినా వివాహానికి ససేమిరా అన్నాడు. దీంతో వధువు కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వివాహం అర్థాంతరంగా ఆగిపోవడంతో వధువు మానస తీవ్ర మనస్తాపానికి గురైంది. బుధవారం నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే ఆమెను ఆర్మూర్ లోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసులు వరుడు, అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.