బీఆర్ఎస్ ఆంధ్ర ఎన్నికల పోరాటం, టిడిపి తెలంగాణ రాజకీయ ప్రయత్నం: ఆసక్తికరం!!
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. టిఆర్ఎస్ పార్టీని బి ఆర్ ఎస్ గా మార్చి జాతీయ రాజకీయాలలో కేసీఆర్ అడుగు పెట్టాలని ప్రయత్నం చేస్తుంటే, ఇక తెలంగాణ వైపు అనేక పాత, కొత్త పార్టీలు దృష్టిసారించడం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు చేయాలని వెళుతున్న బీఆర్ఎస్, ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ పుంజుకోవడం ఈ ప్రయత్నం చేస్తున్న టిడిపి పై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ పార్టీలతో వచ్చే ఎన్నికల్లో నష్టం జరిగేది ఎవరికి అన్న అంశం ఆసక్తికరంగా మారింది.
తెలంగాణాపై టీడీపీ ఫోకస్ .. మండిపడిన బీఆర్ఎస్
తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్వహించిన సభతో తెలంగాణ రాష్ట్రం పై ఫోకస్ పెట్టాలని, తెలుగుదేశం పార్టీకి మళ్లీ పునర్వైభవం తీసుకు రావాలని చంద్రబాబు ప్రయత్నం మొదలుపెట్టారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీకి పట్టున్న ప్రాంతాల పైన ఫోకస్ చేసిన చంద్రబాబు అన్ని చోట్ల బహిరంగ సభలను నిర్వహించాలని నిర్ణయించారు. అయితే చంద్రబాబు తెలంగాణ రాష్ట్రం పై ఫోకస్ చేసేది బిజెపి కోసమేనని, బీజేపీతో పొత్తు పెట్టుకుని బీఆర్ఎస్ పార్టీకి చంద్రబాబు నష్టం చేయడానికి చేసే కుట్ర ఇదని బీఆర్ఎస్ నేతలు తీవ్రస్థాయిలో చంద్రబాబుపై మండిపడ్డారు.
తెలంగాణాలో టీడీపీ ప్రయత్నాలపై విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు
చంద్రబాబు తెలంగాణలో వచ్చే ఎన్నికలలో పొత్తుతో ఏదైనా బిజెపికి లబ్ధి చేకూరుస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న వేళ బిజెపి నేత విజయశాంతి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తెలంగాణలో ప్రస్తుత పరిస్థితుల్లో రానున్న ఎన్నికలలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా నిలిచి అధికారంలోకి రాగలిగే ఒకే పార్టీగా బీజేపీ కార్యాచరణ సాగుతుందని పేర్కొన్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పాదయాత్రలతో ప్రజలలో ఒక అవగాహన, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పరిష్కారం ఉండే అవకాశం ఉంటుంది అని పేర్కొన్నారు.
పాదయాత్రలు, దండయాత్రలు ఏమి చేసినా బీఆర్ఎస్ వ్యతిరేకఓటు చీల్చే కుట్ర
అయితే వేరే ఇతర పార్టీల పాదయాత్రలు, దండయాత్రలు... తెలంగాణపై ఏమి చేసినా అది బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు కొంత చీల్చి బీజేపీని నష్టపరిచే ప్రయత్నమే తప్ప మరొకటి కాదు అని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో బి ఆర్ ఎస్ ఆంధ్ర ఎన్నికల పోరాటం, టిడిపి తెలంగాణ రాజకీయ ప్రయత్నం రెండూ నాకు ఇప్పటికీ అర్థం కాని అంశాలేనని పేర్కొన్న విజయశాంతి వాటిపై కాలం, ప్రజలే నిర్ణయించాలని పేర్కొన్నారు. ఒకపక్క అందరూ టీడీపీ ప్రయత్నం బీజేపీతో పొత్తు కోసం అని చెప్తున్నా విజయశాంతి దానికి ప్రాధాన్యం ఇవ్వకుండా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
బీఆర్ఎస్ తో ఏపీలో .. టీడీపీతో తెలంగాణాలో నష్టం ఎవరికి ?
తెలంగాణ రాష్ట్రంలో దండ యాత్రలు చేస్తున్న, పాదయాత్రలు చేస్తున్న పార్టీల వల్ల బీఆర్ఎస్ పార్టీకి నష్టం జరుగుతుందని గులాబీ నేతలు గగ్గోలు పెడుతుంటే, కాదు కాదు బిజెపికే నష్టం జరిగే అవకాశం ఉందని విజయశాంతి అభిప్రాయం వ్యక్తం చేయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. ఏది ఏమైనా ఏపీలో బి ఆర్ ఎస్.. తెలంగాణలో టిడిపి వచ్చే ఎన్నికల్లో ఎవరికి నష్టం చేస్తాయనేది ముందు ముందు తేలనుంది.