రాజా సింగ్పై క్యాండిడేట్ను ప్రకటించిన బీఆర్ఎస్
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో తెలంగాణలో అధికారంలో ఉన్న భారత్ రాష్ట్ర సమితి- ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోంది. డిసెంబర్లో ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయంటూ కేసీఆర్ సైతం ఇదివరకే లీకులు ఇచ్చారు. జాతీయ రాజకీయాల్లో ప్రవేశించిన తరువాత ఎదుర్కొనబోయే తొలి ఎన్నిక ఇదే కావడంతో దీన్ని బీఆర్ఎస్ నాయకత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.
ఈ ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని ఉవ్విళ్లూరుతోంది బీఆర్ఎస్. జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్రను పోషించడానికి ఈ ఎన్నికలను తొలి మెట్టుగా మలచాలనే పట్టుదలతో ఉంది. వరుసగా మూడుసార్లు గెలిస్తే- ప్రాంతీయ పార్టీలన్నీ బీఆర్ఎస్ వైపే చూస్తాయని, వాటన్నింటినీ ఏకతాటిపైకి తీసుకుని వచ్చి- నాయకత్వాన్ని వహించవచ్చని భావిస్తోంది. ఈ దిశగా ముమ్మరంగా కసరత్తును సాగిస్తోంది బీఆర్ఎస్.

ఈ క్రమంలో- ప్రత్యర్థి పార్టీలు గెలవడానికి ఎలాంటి అవకాశాన్ని కూడా ఇవ్వడానికి సంసిద్ధంగా లేదు. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలను మరోసారి ఓటమిని చవి చూపించేలా వ్యూహాలను రూపొందిస్తోంది. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థులను ఆచితూచి ఎంపిక చేయనుంది. గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వనుంది. టికెట్ల కేటాయింపులో యువతకు ప్రాతినిథ్యాన్ని ఇచ్చే అవకాశాలు లేకపోలేదు.
అభ్యర్థులకు టికెట్ల కేటాయింపు విషయంలో కొన్ని ప్రయోగాలకు కూడా బీఆర్ఎస్ పూనుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. లోక్సభ సభ్యులకు అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలుగా నియమించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ దిశగా ఓ అడుగు ముందుకు వేసింది కూడా. మహబూబాబాద్ లోక్సభ సభ్యురాలు మాలోతు కవితకు భద్రాచలం అసెంబ్లీ బాధ్యతను అప్పగించింది. ఆమెను ఇన్ఛార్జ్గా నియమించింది.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బీజేపీ అత్యంత బలంగా ఉండే అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకటైన గోషామహల్ స్థానానికి కూడా ఇన్ఛార్జీని ప్రకటించింది బీఆర్ఎస్. నంద కిశోర్ వ్యాస్ బిలాల్ను ఇన్ఛార్జీగా అపాయింట్ చేసింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గం- బీజేపీ ఆధీనంలో ఉంది. ఆ పార్టీ తరఫున టీ రాజా సింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2019 నాటి ఎన్నికల్లో ఆయన బీఆర్ఎస్ అభ్యర్థి ప్రేమ్ సింగ్ రాథోడ్ను ఓడించారు.

మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో టీ రాజా సింగ్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది బీజేపీ. ఎన్నికలు సమీపించే సమయానికి ఆయనపై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేయొచ్చని తెలుస్తోంది. మళ్లీ ఆయననే ఇక్కడ బరిలోకి దింపనుంది. జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్న మరో అసెంబ్లీ నియోజకవర్గం కంటోన్మెంట్. దీనికి మర్రి రాజశేఖర్ రెడ్డిని ఇన్ఛార్జ్గా నియమించింది. సిట్టింగ్ ఎమ్మెల్యే జీ సాయన్న మరణించడం వల్ల ప్రస్తుతం ఈ స్థానం ఖాళీగా ఉంటోంది.












Click it and Unblock the Notifications