బీఆర్ఎస్ నేతలకు తొలి పండగ- కవిత నివాసంలో ఘనంగా..!!
హైదరాబాద్: సంక్రాంతి పండగ వేడుకలు తెలంగాణలో ఘనంగా సాగుతున్నాయి. హైదరాబాద్ లో పతంగ్ ఫెస్టివల్ ఉత్సాహంగా జరుగుతోంది. హైదరాబాద్, సికింద్రాబాద్వాసులు తమ ఇళ్లపై గాలిపటాలను ఎగురవేస్తోన్నారు. ట్యాంక్ బండ్ నెక్లెస్ రోడ్ వద్ద పతంగ్ ఫెస్టివల్ లో వందలాది మంది పాల్గొంటోన్నారు. పోలీసులు ముందుజాగ్రత్త చర్యగా జంటనగరాల్లోని అన్నిజంక్షన్లు, రోడ్లు, ప్రార్థనా స్థలాలు, వాటి సమీప ప్రాంతాల్లో గాలిపటాలను ఎగురవేయడాన్ని నిషేధించారు.
కాగా- అధికార తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత్ రాష్ట్ర సమితిగా ఆవిర్భవించిన తరువాత జరుపుకొంటోన్నతొలి సంక్రాంతి పండగ ఇదే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు పూర్తి స్థాయి జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా బదలాయించడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు గత ఏడాది డిసెంబర్ లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
దీని తరువాత బీఆర్ఎస్ కార్యకలాపాలు విస్తృతం అయ్యాయి. కేసీఆర్- దేశ రాజధానిలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని సైతం ప్రారంభించారు. ఏపీలోనూ ఆ పార్టీ అడుగు పెట్టింది. పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు బీఆర్ఎస్ లో చేరిన విషయం తెలిసిందే. రిటైర్డ్ ఐఎఎస్ అధికారి తోట చంద్రశేఖర్, మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు, పార్థసారథి తదితరులు.. కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువాను కప్పుకొన్నారు.
ఈ పరిణామాల మధ్య బీఆర్ఎస్ నాయకులు తొలి సంక్రాంతి పండగను వైభవంగా జరుపుకొంటోన్నారు. కేసీఆర్, మున్సిపల్-ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత- తమ నివాసాల్లో ఘనంగా సంక్రాంతి వేడుకలను నిర్వహించారు. కల్వకుంట్ల కవిత స్వయంగా ముగ్గులు వేశారు. వాటిని అందంగా రంగులతో తీర్చిదిద్దారు.
అంతకుముందు భోగి పండగ నాడు కేబీఆర్ పార్క్ వద్ద సంక్రాంతి సంబరాల్లో పాల్గోన్నారామె. హరిదాసులు, బసవన్నల దీవెనలతో దేశం సుభిక్షంగా వర్ధిల్లాలని ఆకాంక్షించారు. తెలంగాణ జాగృతి వేదిక ద్వారా రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పామని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ ఏర్పాటుతో తెలంగాణ జాగృతిని కూడా భారత జాగృతిగా మార్చినట్లు వెల్లడించారు. దీనికి అనుగుణంగా తమ కార్యకలాపాలను మరింత విస్తరింపజేస్తామని అన్నారు.