నకిలీ జీవోలతో రూ. 5 కోట్ల మోసం: బీఆర్ఎస్ నేత అరెస్ట్
హైదరాబాద్: మిడ్ డే మీల్స్ పేరుతో బెంగళూరుకు చెందిన కంపెనీకి రూ. 5 కోట్లు మోసం చేసిన బీఆర్ఎస్ నేతను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మోసానికి పాల్పడిన నిందితుడు అలిశెట్టి అరవింద్ను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. గత ఏడాది బెంగళూరుకు చెందిన ఓ కంపెనీకి తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం నిర్వహణను అప్పగిస్తామని వారి నుంచి రూ. 5 కోట్లు తీసుకున్నారనే ఆరోపణలున్నాయి.
నకిలీ జీవోలు చూపెట్టి తమ నుంచి డబ్బులు తీసుకుని.. తర్వాత కనిపించకుండా తిరుగుతున్నాడని బాధితులు హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు అరవింద్ ను అదుపులోకి తీసుకున్నారు. కాగా, అరవింద్ బీఆర్ఎస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా కార్యక్రమాలను చూస్టుంటారని సమాచారం. మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితలతో అరవింద్ దిగిన ఫొటోలు ప్రస్తుతం వైరల్గా మారాయి.

ఫార్ములా ఈ-రేస్ ఒప్పందం: అరవింద్ కుమార్కు ప్రభుత్వం షోకాజ్ నోటీసు
ఫార్ములా ఈ రేస్ హెచ్ఎండీఏ ఒప్పందంపై సీనియర్ ఐఏఎస్ అధికారి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్కు రాష్ట్ర ప్రభుత్వం షోకాజ్ నోటీస్ జారీ చేసింది. హెచ్ఎండీఏ కమిషనర్గా నిబంధనలకు విరుద్ధంగా ఒప్పందాలు ఎందుకు చేసుకున్నారో వివరణ ఇవ్వాలని సీఎస్ శాంతికుమారి మెమో ఇచ్చారు. ముందస్తు అనుమతి లేకుండా ఫార్ములా ఈ ఆపరేషన్స్, ఏబీబీ ఫార్ములా ఈతో హెచ్ఎండీఏ త్రైపాక్షిక ఒప్పందం ఎలా చేసుకున్నారో వివరాలు సమర్పించాలని మెమోలో పేర్కొన్నారు.
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా సవరించిన ఒప్పందం ఎందుకు చేసుకున్నారని ప్రభుత్వం ప్రశ్నించింది. హెచ్ఎండీఏ నిధుల్లోంచి సుమారు రూ.55 కోట్లు ఎందుకు చెల్లించారో తెలపాలని ఆదేశించింది. ఈ విషయంలో ఎందుకు చర్యలు తీసుకోకూడదో ఏడు రోజుల్లో సరైన వివరణ ఇవ్వాలని అరవింద్ కుమార్ను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఒకవేళ వివరణ ఇవ్వకపోతే రికార్డుల ఆధారంగా చర్యలు తీసుకుంటామని మెమోలో సీఎస్ స్పష్టం చేశారు. కాగా, హైదరాబాద్ నగరంలో ఫిబ్రవరి 10న నిర్వహించనున్న ఫార్ములా ఈ-రేస్ను రద్దు చేస్తున్నట్లు ఎఫ్ఐఏ ఇటీవలే ప్రకటించింది. నిర్వహణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం స్పందించలేనందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.












Click it and Unblock the Notifications