కాంగ్రెస్ లో చేరిక పై కేసీఆర్ కు మల్లారెడ్డి క్లారిటీ..!!
పార్లమెంట్ ఎన్నికల వేళ హోరా హోరీ రాజకీయం కొనసాగుతోంది. మూడు ప్రధాన పార్టీల మధ్య తెలంగాణలో ఆసక్తి కర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గులాబీ పార్టీ నేతలను కాంగ్రెస్ నేతలు తమ వైపు తిప్పుకుంటున్నారు. ఎంపీలను అటు బీజేపీ తమ పార్టీల్లో చేర్చుకుంటోంది. ఈ సమయంలోనే మాజీ మంత్రి మల్లారెడ్డి కాంగ్రెస్ లో చేరుతారని ప్రచారం సాగుతోంది. దీంతో, మల్లారెడ్డి మాజీ సీఎం కేసీఆర్ తో సమావేశమయ్యారు. పార్టీ మార్పుపై స్పష్టత ఇచ్చారు.
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తోఆ పార్టీ నేత, మాజీ మంత్రి మల్లారెడ్డి భేటీ అయ్యారు. కేసీఆర్ తో పాటుగా కేటీఆర్ తోనూ తన కుమారుడు భద్రారెడ్డితో కలిసి మల్లారెడ్డి సమావేశమయ్యారు. కొద్ది రోజులుగా మల్లారెడ్డి పార్టీ మారుతారని, కాంగ్రెస్లోకి వెళ్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో బీఆర్ఎస్ అధిష్టానం అలర్ట్ అయ్యింది. మల్లారెడ్డికి కబురు పంపింది. తాము సీఎం రేవంత్ సలహాదారు వేం నరేందర్ రెడ్డిని కలవడంపై మల్లారెడ్డి కేటీఆర్కు వివరణ ఇచ్చారు. తన అల్లుడు రాజశేఖర్ రెడ్డికి చెందిన కాలేజీ భవనాల కూల్చివేత అంశంపై కలిసినట్లు పేర్కొన్నారు. తాను పార్టీ మారడం లేదని మల్లారెడ్డి స్పష్టం చేశారు.

గత నెలలో మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ మల్కాజ్గిరి ఎంపీ స్థానానికి తన కుమారుడు భద్రారెడ్డి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.కానీ ఇప్పుడు తాను లోక్సభ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని భద్రారెడ్డి కేటీఆర్కు తెలిపినట్లు సమాచారం. అలాగే మర్రి రాజశేఖర్ రెడ్డి కాలేజీ భవనాల కూల్చివేతపైనా కేసీఆర్ ఆరా తీశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని, కేసీఆర్ వెంటే నడుస్తానని మల్లారెడ్డి స్పష్టం చేశారు. అలాగే తమ కుటుంబానికి మల్కాజిగిరి ఎంపీ సీటు వద్దని, దానికి కారణాలను వివరించారు. ఈ సీటును మెరెవరికైనా ఇవ్వాలని కేసీఆర్కు సూచించారని తెలుస్తోంది. దీంతో, ఇప్పుడు మల్కాజ్ గిరి నుంచి బీఆర్ఎస్ ఎవరిని ఖరారు చేస్తుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications