టీడీపీ గూటికి ఎమ్మెల్యే మల్లారెడ్డి..?
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. రోజుకో ఎమ్మెల్యే పార్టీ మారుతున్నారు. ఇప్పటికే 7 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోగా, తాజాగా మరో ఎమ్మెల్యే పార్టీ మారడానికి సిద్ధమయ్యారు. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సైతం కాంగ్రెస్ గూటికి చేరడానికి రెడీ అయ్యారు. శుక్రవారం ఆయన సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఇదిలా ఉంటే మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి సైతం పార్టీ మారుతున్నారనే ప్రచారం జరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మల్లారెడ్డికంటూ ప్రత్యేక గుర్తింపు ఉంది.
2014 ఎన్నికల్లో టీడీపీ తరుఫున తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారాయన. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో ఆయన అప్పటి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018 ఎన్నికల్లో మరోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించి కేసీఆర్ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. మంత్రిగా ఉన్న సమయంలో రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారాయన. పరుష పదజాలంతో ఇప్పటి సీఎంపై రెచ్చిపోయారు. అయితే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి మల్లారెడ్డి ఒక్కసారిగా టార్గెట్ అయ్యారు.

మల్లారెడ్డికి సంబంధించిన కాలేజీలు, బిజినేస్లపై కాంగ్రెస్ ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. దీంతో ఆయన ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.ఈక్రమంలో ఆయన పార్టీ మారాలని ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వ దాడుల నుంచి బయటపడటానికి తొలుత ఆయన బీజేపీలో చేరాలని ప్రయత్నించారు. అయితే మల్లారెడ్డి చేరికపై బీజేపీ అధిష్టానం సానుకూలంగా స్పందించకపోవడంతో ఆయనకు టీడీపీ ఆప్షన్గా కనిపించింది. దీంతో తాను రాజకీయంగా ప్రస్థానం ప్రారంభించిన టీడీపీలోనే చేరాలని నిర్ణయానికి మల్లారెడ్డి వచ్చారట.
ఇదే సమయంలో ఏపీలో టీడీపీ కూటమి విజయం సాధించడంతో మల్లారెడ్డి ఆ పార్టీలో చేరాలని ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు ఆయన ఇప్పటికే టీడీపీ అధిష్టానానికి రాయబారం కూడా పంపినట్టు సమాచారం. తెలంగాణలో టీడీపీకి పెద్దగా బలం లేకపోయినా , తనకు ప్రభుత్వం నుంచి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే టీడీపీలో చేరడమే మంచిదని మల్లారెడ్డి భావిస్తున్నారు. తెలంగాణలో టీడీపీకి సరైన నాయకత్వం లేకపోవడం తనకు కలిసి వస్తుందని మల్లారెడ్డి లెక్కలు వేసుకుంటున్నారు.
తనతో పాటు ఒకరిద్దరు ఎమ్మెల్యేలను టీడీపీలోకి తీసుకువెళ్తే తెలంగాణ పార్టీ అధ్యక్ష పదవి తనకే దక్కుతుందని,రేవంత్ రెడ్డితో చంద్రబాబుకు సన్నిహిత సంబంధాలు ఉండడంతో కాంగ్రెస్ ప్రభుత్వం తనను టార్గెట్ చేయదని, ప్రస్తుతం ఏపీలో బీజేపీ, టీడీపీ మిత్రపక్షాలుగా ఉండడంతో తెలంగాణలోనూ ఆ ఎఫెక్ట్ పనిచేస్తుందని, ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో టీడీపీలో చేరితేనే తనకు అన్ని విధాల కలిసి వస్తుందని లెక్కల్లో మల్లారెడ్డి ఉన్నారట. అన్ని అనుకున్నట్టు జరిగితే కొద్ది రోజుల్లోనే మల్లారెడ్డి టీడీపీ తీర్ధం పుచ్చుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. మరి మల్లారెడ్డి బీఆర్ఎస్ను వీడి టీడీపీలో చేరుతారో లేదో చూడాలి.












Click it and Unblock the Notifications