ఢిల్లీ బయల్దేరిన ఎమ్మెల్సీ కవిత: పార్టీ అండగా ఉంటుందంటూ ఫోన్లో కేసీఆర్ భరోసా
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీకి బయల్దేరారు. బంజారాహిల్స్ నివాసం నుంచి.. బుధవారం సాయంత్రం నేరుగా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.
హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీకి బయల్దేరారు. బంజారాహిల్స్ నివాసం నుంచి.. బుధవారం సాయంత్రం నేరుగా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అక్కడ్నుంచి ఆమె విమానంలో ఢిల్లీకి చేరుకోనున్నారు. ప్రగతిభవన్ వెళ్లి సీఎం కేసీఆర్ తో ఆమె భేటీ అవుతారని అంతా అనుకున్నప్పటికీ.. ఆమె నేరుగా ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు.
శంషాబాద్ విమానాశ్రయంకు వెళ్లే సమయంలో కవిత వెంట ముఖ్య అనుచరులు, కొంతమంది పార్టీ నేతలు ఉన్నారు. భారీ కాన్వాయ్తో ఆమె ఎయిర్ పోర్టు చేరుకున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
కాగా, ఢిల్లీకి వెళ్లేముందు తండ్రి, తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో కవిత ఫోన్లో మాట్లాడినట్లు తెలిసింది. నీ కార్యక్రమం నువ్వు కొనసాగించు.. ఆందోళన పడాల్సిన అవసరం లేదని కేసీఆర్ కవితకు ధైర్యం చెప్పారు. బీజేపీ ఆకృత్యాలపై న్యాయ పరంగా పోరాడుదామని చెప్పారు. పార్టీ అండగా ఉంటుందని కవితకు కేసీఆర్ భరోసా ఇచ్చారు.

అయితే, మార్చి 9వ తేదీన విచారణకు హాజరు కాలేనని.. ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాల కారణంగా మార్చి 15వ తేదీ తర్వాత వస్తానంటూ ఈడీకి కవిత లేఖ రాశారు. అయితే, కవిత లేఖపై సాయంత్రం 4 గంటల వరకు ఈడీ నుంచి సమాధానం రాలేదు. దీంతో ఆమె ఢిల్లీకి బయల్దేరి వెళ్లినట్లు తెలుస్తోంది.
కాగా, మార్చి 10న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మహిళా బిల్లు సాధన దీక్ష చేపట్టనున్నారు కవిత. ఈడీ నోటీసులతోపాటు దీక్షా కార్యక్రమం ఉండటంతో కవిత ఈరోజే ఢిల్లీకి వెళ్లారు.












Click it and Unblock the Notifications