వేరే పార్టీ గుర్తుపై గెలిచినవారు ఓడిపోతారు: ఎమ్మెల్యే టికెట్లపై పట్నం మహేందర్ రెడ్డి సంచలనం
హైదరాబాద్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక పార్టీ గుర్తుపై గెలిచి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన వారందరినీ ప్రజలు తిరస్కరిస్తారని స్పష్టం చేశారు. తాజాగా, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే జరిగిందని.. రాష్ట్రంలోనూ అదే పునరావృతమవుతుందని అన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరులో ఆయన మీడియాతో మాట్లాడారు.
తాను కారు గుర్తు పైనే గెలిచానని, వేరే పార్టీలో నుంచి గెలిచి రాలేదన్నారు పట్నం మహేందర్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలలో పాల్గొని విజయవంతం చేస్తామన్నారు. ప్రజా క్షేత్రంలోకి పల్లెకు పల్లె పట్నం కార్యక్రమాన్ని జూన్ 21 నుంచి నిర్వహిస్తామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తాండూరు నియోజకవర్గం తానే పోటీ చేస్తానని.. సీఎం కేసీఆర్ తనకే టికెట్ ఇస్తారని మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు.

సర్వేలన్నీ తనకే అనుకూలంగా ఉన్నాయని అన్నారు పట్నం మహేందర్రెడ్డి. గత ఎన్నికల్లో కారు గుర్తు అనుకొని కొందరు ట్రక్కు గుర్తుకు ఓటేయడంతోనే తాను ఓడిపోయానని చెప్పుకొచ్చారు.2018 ఎన్నికల్లో ఒక పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు కొందరు మరో పార్టీలో చేరడంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ అధిష్టానం ఈ విషయంలో తనను వివరణ కోరినా.. ఉన్న విషయమే మాట్లాడనని చెబుతా అన్నారు. తాండూరులో తన కేడర్ చెక్కు చెరదలేదన్నారు.
రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు వచ్చినట్లే తాండూరుకు కూడా ఎస్డీఎఫ్ ద్వారా రూ. 136 కోట్లు వచ్చాయని, ఇందులో గొప్పేమీ లేదన్నారు. కాగా,గతకొంతకాలంగా తాండూరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డిల మధ్య విభేదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే.
2018 ముందస్తు ఎన్నికల్లో తాండూరులో పట్నం మహేందర్ రెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్ధి అయిన పైలెట్ రోహిత్ రెడ్డి గెలిచారు. ఆ తర్వాత రోహిత్ రెడ్డి బీఆర్ఎస్లో చేరారు. ఈ క్రమంలో తాజాగా మహేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా తాండూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని ఉద్దేశించినవేనని స్పష్టమవుతోంది.దీనిపై రోహితర్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.












Click it and Unblock the Notifications