ఎమ్మెల్యేల ఎరకేసులో బీఆర్ఎస్ కొత్త అస్త్రం: సీబీఐ ఎంట్రీతో కేటీఆర్ కొత్త డిమాండ్!!
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ నేతలు మెడకే చుట్టుకునేలా కనిపిస్తుంది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఈ డి ఎంట్రీ ఇవ్వడం, ఊహించని విధంగా కోర్టు కూడా సిబిఐ ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో దీనిని ఎట్లా ఎదుర్కోవాలి అనేదానిపై బీఆర్ఎస్ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇక తాజాగా మంత్రి కేటీఆర్ చేసిన ప్రకటనతో ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసు వ్యవహారంలో బి ఆర్ ఎస్ కొత్త అస్త్రాన్ని ఎంచుకుంటుంది అని అర్థమవుతుంది.

సీబీఐ ఎంట్రీనే బీజేపీ కేసులో ఉందని చెప్పే సాక్ష్యం: మంత్రి కేటీఆర్
తాజాగా మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యేలు కొనుగోలు కేసులో సీబీఐ ఎంట్రీతో బిజెపి ముసుగు తొలిగిపోయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. హైకోర్టు ఇచ్చిన తీర్పు తమ విజయమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తో పాటు ఇతర బిజెపి నేతలు సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటని మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. ఇదే సమయంలో దొంగలు కెమెరా కంటికి చిక్కిన సమయంలోనే బండారం బట్టబయలు అయ్యిందని, కలుగులో దాక్కున్న ఎలుకలు మెల్లగా బయటకు వచ్చాయని పేర్కొన్నారు. కేసులో దొరికిన స్వామీజీలతో అసలు సంబంధమే లేదని చెప్పిన వాళ్ళు, సిబిఐకి కేసును బదలాయించడంతో సంబరాలు చేసుకుంటున్నారని విమర్శించారు. ఇక ఇదే సమయంలో సరికొత్త డిమాండ్ తెరమీదకు తీసుకువచ్చారు మంత్రి కేటీఆర్.

దమ్ముంటే ఆ టెస్టులకు సిద్ధం కండి
కిషన్ రెడ్డికి దమ్ముంటే సిబిఐ దర్యాప్తుతో పాటు దొరికిన దొంగలకు నార్కో అనాలసిస్, లై డిటెక్టర్ టెస్ట్ లకు సిద్ధం కావాలని డిమాండ్ చేశారు మంత్రి కేటీఆర్. అంతేకాదు కేంద్ర దర్యాప్తు సంస్థలను రంగంలోకి దించి బిజెపి ప్రభుత్వం ప్రత్యర్థి పార్టీలపై విషప్రయోగం చేస్తోందని మండిపడ్డారు. ఎమ్మెల్యేలను అంగడి సరుకుల్లా కొని రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చడానికి బిజెపి కంకణం కట్టుకుందని మండిపడ్డారు. ఇక కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ చేతిలో కీలు బొమ్మలు అంటూ మంత్రి కేటీఆర్ విమర్శించారు.

నేరం చేసిన వాళ్లకు ప్రజా కోర్టులో శిక్ష తప్పదు
ఎమ్మెల్యేల కొనుగోలు బండారం పై నిజమైన ప్రజాక్షేత్రంలో బీజేపీ పై విచారణ ఎప్పుడో ప్రారంభమైంది అని పేర్కొన్న మంత్రి కేటీఆర్ నేరం చేసిన వాళ్లకు ప్రజా కోర్టులో శిక్ష తప్పదని హెచ్చరించారు. సరైన సమయంలో బీజేపీకి చెంప పెట్టు లాంటి తీర్పు ఇవ్వడం కోసం యావత్ భారత సమాజం సిద్ధంగా ఉందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సిబిఐ సహా వ్యవస్థలు అన్నిటినీ సంపూర్ణంగా భ్రష్టు పట్టించిన తీరును దేశ ప్రజలు గమనిస్తున్నారని మంత్రి కేటీఆర్ తెలిపారు.

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిజం తేలాలంటే .. ఆ పని చెయ్యండి
ఇక తాజా మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో తెర మీదకి కొత్త డిమాండ్ వచ్చి చేరింది. సిబిఐ దర్యాప్తు తో పాటు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో దొరికిన దొంగలకు నార్కో ఎనాలసిస్, లై డిటెక్టర్ టెస్ట్ లను చేయాలని, అది చేస్తే అసలు విషయం బయట పడుతుందని డిమాండ్ వినిపిస్తోంది. మంత్రి కేటీఆర్ ఇదే విషయాన్ని స్పష్టం చేసి, కేంద్ర దర్యాప్తు సంస్థలు బిజెపికి అనుకూలంగా పని చేస్తున్నాయని మండిపడ్డారు. ఇక సీబీఐ ఎటువంటి తీర్పు ఇస్తుందో అందరికీ తెలుసు అని పేర్కొని, ఇది బిజెపి అధికార దుర్వినియోగానికి నిదర్శనమన్నారు.

ప్రజలకు అసలు విషయం అర్ధమైందని బీఆర్ఎస్ వాదన
కేంద్ర దర్యాప్తు సంస్థలను జేబు సంస్థలా మార్చుకున్న బిజెపి తీరుకు ఇది నిదర్శనమన్నారు. ఇక ఈ కేసులో బీజేపీ ముసుగు తొలిగిపోయిందని, ప్రజలకు అసలు విషయం బోధపడింది అన్నారు. ఎమ్మెల్యేల ఎర కేసులో సిబిఐ ఎంట్రీతో మంత్రి కేటీఆర్ తాజాగా చేసిన వ్యాఖ్యలలో ఈ కేసును ఎదుర్కోవడానికి బి ఆర్ ఎస్ ఫ్యూచర్ ప్లాన్ కనిపిస్తుంది.












Click it and Unblock the Notifications