సదర్ స్పెషల్: రూ. 25 కోట్ల షహెన్ షా(దున్నపోతు), ప్రత్యేకతలివే!
నగరం సదర్ ఉత్సవానికి సిద్ధమైంది. దీపావళిని పర్వదినాన్ని పురస్కరించుకొని సదర్ సమ్మేళనాన్ని అక్టోబర్ 21న హైదరాబాద్లోని నారాయణగూడలో నిర్వహించనున్నారు.
హైదరాబాద్: నగరం సదర్ ఉత్సవానికి సిద్ధమైంది. దీపావళిని పర్వదినాన్ని పురస్కరించుకొని సదర్ సమ్మేళనాన్ని అక్టోబర్ 21న హైదరాబాద్లోని నారాయణగూడలో నిర్వహించనున్నారు. యాదవుల సంస్కృతి, సంప్రదాయానికి ప్రతీక అయిన ఈ ఉత్సవాలను ఈ సారి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుండటం విశేషం.
ప్రత్యేక ఆకర్షణగా సెషన్ షా
జాతీయ స్థాయి పశు మేళాల్లో 12 సార్లు ఛాంపియన్గా నిలిచిన హర్యానాకు చెందిన రుస్తుం(దున్నపోతు) ద్వారా జన్మించిన షహెన్షా (దున్నపోతు) ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, టీఆర్ఎస్ నేత ఎడ్ల హరిబాబు యాదవ్ సదర్ ఉత్సవాల్లో దీన్ని ప్రదర్శించనున్నారు.
రూ. 25కోట్ల సెషన్ షా
షహెన్ షా విలువ రూ.25 కోట్లని ఆయన తెలిపారు. ఈ దున్నపోతును సోమవారం
ముషీరాబాద్ సత్తార్బాగ్లో ప్రదర్శనలో ఉంచారు. ముర్రాజాతికి చెందిన దీన్ని సత్తార్బాగ్ యాజమాని అహ్మద్ ఆలంఖాన్ పోషిస్తున్నారు.
సెషన్ షా ప్రత్యేకతలు..
షహెన్ షా వయస్సు నాలుగున్నరేళ్లు. ఎత్తు ఆరున్నర అడుగులు, వెడల్పు 15 అడుగులు, బరువు 1500 కిలోలు. రోజుకు 100 యాపిల్ పండ్లు, ఖాజా, పిస్తా, బాదం, నల్ల బెల్లం, ఖర్జూర పండ్లు కలిపి 5 కిలోలు తింటుంది. 40 లీటర్ల పాలు తాగుతుంది.
సంరక్షణా ప్రత్యేకమే..
షహెన్షా ద్వారా జన్మించిన గేదెలు రోజుకు 18 లీటర్ల పాలు ఇస్తాయని హరిబాబు యాదవ్ తెలిపారు. దీనికి నిత్యం మూడుసార్లు ఆవ నూనెతో మసాజ్ చేయడంతోపాటు మూడు పర్యాయాలు సబ్బుతో స్నానం చేయిస్తారు. రోజూ ఐదు కిలోమీటర్లు నడిపిస్తారు. దీని సంరక్షణ కోసం ఆరుగురు పని చేస్తుంటారు. షహెన్ షా రోజువారీ నిర్వహణ ఖర్చు రూ.5 వేలు కావడం గమనార్హం.
ఏర్పాట్లు పూర్తి.. ఘనంగా ఉత్సవాలు
అక్టోబర్ 21న అధికారికంగా నిర్వహించనున్న సదర్ ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోమవారం వివిధ విభాగాల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉత్సవాలను నిర్వహించనున్న నారాయణగూడ వైఎంసీఏ ప్రాంతాన్ని పరిశీలించారు. తెలంగాణలోని అన్ని జిల్లాలకు చెందిన యాదవులు ఈ వేడుకల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని చాటేలా పాటలు, కళా ప్రదర్శనలు, నృత్య ప్రదర్శనలు, తదితర సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. 21వ తేదీ రాత్రి 7 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు సదర్ వేడుకలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు మంత్రి తలసాని తెలిపారు.