ధాన్యం కొనడం కేంద్ర ప్రభుత్వ ప్రధమ కర్తవ్యం.!రాష్ట్ర రైతాంగానికి వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి లేఖ.!
హైదరాబాద్ : దేశంలో రైతులు పండించే పంటలకు మద్దతుధర ప్రకటించడం, వాటిని సేకరించి, నిల్వ చేసి, కరువుకాటకాలు తలెత్తినప్పుడు కార్మికులు, సైనికులకు పంపిణీ చేయడమే కాకుండా సమాజంలో ఉన్న పేద బడుగు బలహీనవర్గాలకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నిరంతరం సరఫరా చేయడం కేంద్రప్రభుత్వ విధి అని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పష్టం చేసారు. ఇదే అంశం పట్ల ఆయన రాష్ట్ర రైతాంగానికి సుధీర్ఘ లేఖ రాసారు. వరి ధాన్యం కొనుగోలులో ఎవరిది సత్యం, ఎవరిది అసత్యం అనే అంశాన్ని లేఖ ద్వారా రైతులకు వివరించే ప్రయత్నం చేసారు వ్యవసాయ శాఖా మంత్రి.

బీజేపి ప్రభుత్వం నియామాలను తుంగలో తొక్కిందన్న సింగిరెడ్డి
ధాన్యం సేకరణ కేంద్ర ప్రభుత్వ విధి.. బీజేపి ప్రభుత్వం నియామాలను తుంగలో తొక్కిందన్న సింగిరెడ్డి
కేంద్రం ప్రకటించిన మద్దత్తు ధరకు వరి ధాన్యం కొనుగోలును కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎఫ్ సీ ఐ చేస్తుంది. 2015లో ప్రధానమంత్రి మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శాంతా కుమార్ కమిటీ పంటల కొనుగోలు మాత్రమే కాకుండా ఎఫ్ సీ ఐ సంస్థ పంటల ఎగుమతుల మీద కూడా దృష్టిసారించాలని, నిల్వల సామర్ధ్యం పెంచుకోవాలని, పండిన పంటలన్నీ మద్దత్తు ధరకు కొనుగోలు చేయాలని నివేదికలో సూచించింది. కానీ కేంద్రం ఆ దిశగా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని లేఖలో పేర్కొన్నారు వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.

ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం డబల్ గేమ్.. తెలంగాణ సర్కార్ ను దోషిగా చూపే ప్రయత్నమన్న మంత్రి
తెలంగాణలో యాసంగి వరి ధాన్యం సేకరణ విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఖరి దూడను చీకమని, బర్రెను తన్నమని చెప్పినట్లుందని అన్నారు. తెలంగాణలో ఈ యాసంగి నుండి బాయిల్డ్ రైస్ సేకరణ ఉండబోదని కేంద్రం స్పష్టంగా ప్రకటించింది. ధాన్యం సేకరణ, వరి సాగు విషయంలో కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, నరేంద్ర సింగ్ తోమర్ గార్లు భిన్న వాదనలతో తెలంగాణ రైతాంగాన్ని గందరగోళ పరుస్తున్నారు. గత ఏడాది కొనుగోలు చేసిన ధాన్యం నుండి తీసిన బియ్యం ఇక్కడి గోదాముల నుండి తరలించకుండా, ఆ నెపాన్ని తెలంగాణ రాష్ట్రం మీద నెట్టి రైతులను కేంద్రం తప్పుదారి పట్టిస్తున్నదని మంత్రి ఆవేదన వ్యక్తం చేసారు.

గందరగోళానికి కేంద్రమే కారణం.. రాష్ట్ర బీజేపి నేతలకు అవగాహన లేదన్న మంత్రి సింగిరెడ్డి
మరోవైపు వైపు కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అసలు వరి సాగు విషయంలో తాము తెలంగాణకు ఎలాంటి ఆంక్షలు విధించలేదని పార్లమెంటులో ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. బాయిల్డ్ రైస్ సేకరించలేమని ఒకవైపు, వరి సాగు మీద ఆంక్షలు లేవని ఇంకో వైపు ప్రకటించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వంద విధానాలు స్పష్టంగా అర్దమవుతున్నాయి. ఇప్పటికే తెలంగాణలో గత సీజన్ లో సేకరించిన బియ్యం నిల్వలు ఖాళీ చేయకుండా సకాలంలో బియ్యం తరలింపుకు రైల్ ర్యాక్ లు పంపకుండా ఎఫ్ సీ ఐ వేధిస్తున్నది. కేంద్రం ప్రకటనలు ఈ విధంగా ఉంటే తెలంగాణ బీజేపీ నేతలు వరి సాగు మాత్రమే చేయాలని ప్రచారం చేస్తూ రైతాంగాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని లేఖలో మంత్రి మండిపడ్డారు.

శాంతాకుమార్ కమిటీ సూచనలు ఎందుకు అమలు చేయడం లేదు.. సూటిగా ప్రశ్నించిన మంత్రి
తెలంగాణ రైతాంగం ఈ భిన్న వైఖరులను గమనించాలని మంత్రి కోరారు. వాస్తవంగా దేశంలో కొరత ఉన్న పప్పుధాన్యాలు, నూనె గింజలను ఇతర దేశాల నుండి సేకరించేందుకు కేంద్ర ప్రభుత్వం వెచ్చించే 2 లక్షల కోట్ల రూపాయలకు బదులు, శాంతాకుమార్ కమిటీ సూచన మేరకు దేశంలో వాటి సాగుకు, రాష్ట్రాల ద్వారా వాటిని సేకరించేందుకు కేంద్రం సహకారం అందించాలి. దేశంలో వివిధ రంగాలలో కార్పోరేట్ సంస్థలకు సుంకాలను తగ్గిస్తూ, లక్షల కోట్ల రుణాలను రద్దు చేస్తూ అండగా నిలుస్తుంది. కానీ ప్రపంచానికి అన్నం పెట్టే వ్యవసాయ రంగానికి ప్రోత్సాహం అందించడం లేదు. ఈ విషయంలో కేంద్రం కార్పోరేట్లకు ఇస్తున్న సహకారం వ్యవసాయ రంగానికి అందిస్తే రైతులకు ఇబ్బందులు తొలుగుతాయి. ఆ దిశగా కేంద్రం ఆలోచించకపోవడం దురదృష్టకరమన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి.
Recommended Video

వరికి బదులుగా ఇతర పంటల సాగు మేలు.. రైతాంగానికి టీ సర్కార్ సూచన
తెలంగాణ నేలలు అన్నిరకాల పంటల సాగుకు అనుకూలమన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. దీనిని గమనించే ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు సాగునీటి రంగానికి ప్రాధాన్యతనిచ్చి స్వల్పకాలంలో సాగునీరు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఏ పంటకైనా సాగునీటి వసతి అనివార్యం అని అన్నరు. వరి సాగుకు మాత్రమే అనుకూలంగా ఉండే కొన్ని భూములను వదిలేస్తే మిగిలిన భూములలో వైవిధ్యమైన పంటలను పండించవచ్చని మంత్రి తెలిపారు. అందుకు తగిన వాతావరణ పరిస్థితులు ప్రపంచంలో కొన్ని ప్రాంతాలకు మాత్రమే సొంతమని, అందులో తెలంగాణ ప్రాంతం ఒకటిని, గతంలో బోర్ల కింద భిన్నపంటలు సాగుచేసిన అనుభవం తెలంగాణ రైతాంగానికి ఉందని మంత్రి స్పష్టం చేసారు.












Click it and Unblock the Notifications