ముగిసిన చివరి విడత ప్రచారం...పరిషత్ పోలింగ్కు సర్వం సిద్ధం..
తెలంగాణలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ చివరి విడత ఎన్నికల ప్రచారం ముగిసింది. మంచిర్యాల, కొమ్రంభీం ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో సాయంత్రం 4గం.లకు మిగతా జిల్లాల్లో సా. 5గం.లకు ప్రచారానికి తెర పడింది. మంగళవారం జరగనున్న పోలింగ్ కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. తుది విడత ఎన్నికల కోసం అధికారులు బ్యాలెట్ బాక్సులను ఇప్పటికే గ్రామాలకు చేరవేశారు.
మూడో విడత పరిషత్ పోరులో 27జిల్లాల్లోని 161 జెడ్పీటీసీ, 1,738 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. 741మంది 161 జెడ్పీటీసీ కోసం పోటీ పడుతుండగా... 5,723మంది ఎంపీటీసీ స్థానాల కోసం బరిలో నిలిచారు. ఈ దశలో ఎన్నిక జరగనున్న ఎంపీటీసీ స్థానాల్లో 30 ఏకగ్రీవం అయ్యాయి. పోలింగ్ సమయంలో ర్యాలీలు, బహిరంగసభలతో పాటు పార్టీ జెండాలు, బ్యానర్లు కలిగి ఉన్నట్లయితే కేసులు నమోదుచేస్తామని ఈసీ హెచ్చరించింది.

ఎంపీటీసీ, జెడ్పీటీసీ బ్యాలెట్ పేపర్లు సోషల్ మీడియాలో దర్శనమివ్వడంపై ఈసీ సీరియస్ అయింది. పోలింగ్ సిబ్బంది, ఓటర్లు ఓటు వేస్తున్న ఫొటోలు తీసుకుని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తే ఊరుకునే ప్రసక్తేలేదని తేల్చి చెప్పింది. పోలింగ్ కేంద్రాల్లో ఫొటోలు తీసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం వార్నింగ్ ఇచ్చింది. ఫోటోలు తీసే వారికి రెండేళ్ల జైలుశిక్షతో పాటు రూ.2వేల
జరిమానా విధిస్తామని అధికారులు చెప్పారు.












Click it and Unblock the Notifications