కారు, పదహారు, సర్కార్ : ఇదే గులాబీ నినాదమట ?
హైదరాబాద్ : కారు, పదహారు, సర్కార్ ఇదే తమ నినాదమని స్పష్టంచేశారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. టీఆర్ఎస్ ఇంటి పార్టీ అని .. ఇంటి పార్టీని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. మంగళవారం తెలంగాణ భవన్ లో కేటీఆర్ సమక్షంలో యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన నేతలు టీఆర్ఎస్లో చేరారు.
హక్కుల సాధన తేలిక
రాష్ట్రంలోని 16 స్థానాల్లో టీఆర్ఎస్ గెలిస్తే .. కేంద్రంలో ఏర్పడే థర్డ్ ఫ్రంట్ లో టీఆర్ఎస్ కీ రోల్ పోషిస్తోందని చెప్పారు కేటీఆర్. నిధులు, ప్రాజెక్టు పనులు సులువుగా సాధించొచ్చని పేర్కొన్నారు.
గ్రామాల్లో జలసిరులు
మిషన్ కాకతీయతో గ్రామాల్లో జలసిరులు నెలకొన్నాయని గుర్తుచేశారు కేటీఆర్. చెరువులకు పూర్వవైభవం వచ్చి, రెండు పంటలు సాగవుతున్నాయని పేర్కొన్నారు. వరంగల్ నుంచి హైదరాబాద్ వరకు పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు.
ఇల్లు కట్టి, పెళ్లి చేసి, పెద్దకొడుకైన కేసీఆర్
ఎవరైనా ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు. కానీ కేసీఆర్ ఇల్లు కట్టిస్తూ, పెళ్లికి ఆర్థికసాయం చేస్తున్నారని పేర్కొన్నారు. అంతేకాక అవ్వ, అయ్యా పింఛను పెంచి వారి పాలిట పెద్దకొడుకుయ్యాడని పేర్కొన్నారు.
కాపీ చంద్రబాబు
తెలంగాణ పథకాలను చంద్రబాబు కాపీ కొట్టారని ఆరోపించారు. రైతు బంధు పథకాన్ని అన్నదాత సుఖీభవ పేరుతో మార్చారని తెలిపారు. మేం చేస్తున్న అభివృద్ది పనులతో కాంగ్రెస్, బీజేపీ నేతలు గుక్కతిప్పుకోని పరిస్థితి ఏర్పడిందన్నారు.
ఓట్లు దండుకోవడమే ...
బీజేపీ నేతలు హిందూత్వ వాదులమని, హిందూత్వ అని చెప్పుకుంటారు. అయోధ్యలో మందిరం కడుతామని గత 25 ఏళ్ల నుంచి ఓట్లు దండుకుంటున్నారు. కానీ వారు చేసిందేమీ లేదు. కానీ ఏం చెప్పని కేసీఆర్ .. యాదాద్రి కోసం రూ.2 వేల కోట్లు కేటాయించి అభివృద్ధి చేస్తున్నారని గుర్తుచేశారు. కొలనుపాకను బృందావన్ గార్డెన్ తలపించేలా అభివృద్ధి చేస్తామని హామీనిచ్చారు.
దిల్దార్నే కోరుకుంటున్నారు
దేశంలో ప్రజలు చౌకీదార్ మోదీ, ఫేక్ దార్ రాహుల్ గాంధీని కోరుకోవడం లేదన్నారు కేటీఆర్. వారి పాలనతో ప్రజలు విసుగు చెందారని గుర్తుచేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు కలిపి కూటమి ఏర్పడుతోందన్నారు.
ఉత్తమ్ .. రాజీనామా చేసి బరిలో నిలువు
కాంగ్రెస్, బీజేపీ నేతలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడరాని మండిపడ్డారు. ఉత్తమ్ నీకు దమ్ముంటే హుజూర్ నగర్ అసెంబ్లీకి రాజీనామా చేసి నల్గొండ పార్లమెంట్ కు పోటీ చేయాలని సవాల్ విసిరారు.