వందకు పైగా కార్ల చోరీ, వంశీ పట్టివేత: కళ్లలో కారం చల్లి దోపిడీ
హైదరాబాద్: పెద్ద యెత్తున కార్ల దొంగతనానికి పాల్పడిన అంతరాష్ట్ర దొంగల ముఠాను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ర్టాలో 100కు పైగా కార్లను ఈ ముఠా దొంగలించినట్లు పోలీసులు వెల్లడించారు. 30 కార్లను రికవరీ చేసిన పోలీసులు గ్యాంగ్ లీడర్ వంశీతో పాటు మరో ఇద్దరు సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. తన చోరీలకు వంశీ చిన్న పిల్లలను వాడుకుంటున్నట్లు సమాచరాం.
ఇదిలావుంటే, మెదక్ జిల్లాలోని సంగారెడ్డి మండలం కంది గ్రామ సమీపంలో దారి దోపిడి జరిగింది. కారును అడ్డగించిన దుండగులు డ్రైవర్ ఇషాక్ కళ్లల్లో కారం చల్లారు. అనంతరం కారులో ఉన్న పత్తి వ్యాపారులను బెదిరించిన ముగ్గురు దొంగలు రూ. 50 లక్షల నగదు ఎత్తుకెళ్లారు.
పత్తి వ్యాపారులు హైదరాబాద్ నుంచి సదాశివపేటకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సంగారెడ్డి రూరల్ పోలీస్స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ సుమతి సందర్శించారు.
బ్యాంక్ దోపిడీకి విఫలయత్నం
కరీంనగర్ జిల్లాలోని రాయికల్ మండలం అల్లిపూర్లో తెలంగాణ గ్రామీణ బ్యాంక్లో చోరీకి యత్నం జరిగింది. తాళాలు పగలగొట్టి లోనికి ప్రవేశించిన దొంగలు లాకర్ను పగలగొట్టేందుకు విఫలయత్నం చేశారు. బ్యాంకు వద్ద చప్పుడు రావడంతో గ్రామస్తులు మేలుకుని అరిచారు. దీంతో దొంగలు పరారయ్యారు. గ్రామస్తుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న రాయికల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
నకిలీ వీసాలతో పట్టుబడిన ముగ్గురు
నకిలీ వీసాలతో దుబాయ్ వెళ్లేందుకు యత్నించిన ముగ్గురిని శంషాబాద్ ఆర్జీఐఏ పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం ప్రకాశం జిల్లాకు చెందిన ఖాదర్బాషా, కడప, నిజామాబాద్ జిల్లాలకు చెందిన ఓ మహిళ, మరోవ్యక్తి దుబాయ్ వెళ్లడానికి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చారు. ఇమ్మిగ్రేషన్లో అధికారులు వీరి వీసాలను తనిఖీ చేసి నకిలీగా గుర్తించారు.