సిబిఐ మాజీ డైరెక్టర్ విజయరామారావు కొడుకుపై కేసు, 304కోట్ల ఎగవేత
హైదరాబాద్: మాజీ మంత్రి విజయ రామారావు కుమారుడు శ్రీనివాస కల్యాణరావు పైన సిబిఐ అధికారులు కేసు నమోదు చేశారు. మూడు బ్యాంకులను మోసం చేసి రుణాలు పొందారనే అభియోగంపై చెన్నైలో సిబిఐ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మూడు బ్యాంకుల నుంచి రూ.వందల కోట్లను రుణాలుగా తీసుకున్న కల్యాణ రావు వాటిని తీర్చడంలో మాత్రం విఫలమయ్యారు. దీంతో బ్యాంకు అధికారుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సిబిఐ శనివారం ఆయనపై కేసు నమోదు చేసింది.
వెనువెంటనే రంగంలోకి దిగిన సిబిఐ అధికారులు హైదరాబాదు, చెన్నైలోని కల్యాణ రావు నివాసాల పైన ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. కేసు నమోదు నేపథ్యంలో నేడు కల్యాణరావును సిబిఐ అధికారులు విచారించే అవకాశమున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
వ్యాపారాల పేరిట కొన్ని ఆస్తులు తనఖా పెట్టిన కల్యాణ రావు మూడు బ్యాంకుల నుంచి రూ.304 కోట్ల మేర రుణాలు తీసుకున్నారు. సెంట్రల్ బ్యాంకు నుంచి రూ.124 కోట్లు, కార్పొరేషన్ బ్యాంకు నుంచి రూ.120 కోట్లు, ఆంధ్రా బ్యాంకు నుంచి రూ.60 కోట్ల మేర రుణాలు తీసుకున్నారని తెలుస్తోంది.
రుణాలు తీసుకున్న తర్వాత కల్యాణ రావు వాయిదాలు చెల్లించకపోవడంతో ఆయన తనఖా పెట్టిన ఆస్తులను ఆయా బ్యాంకులు పరిశీలించాయి. ఈ క్రమంలో సదరు ఆస్తులు నకిలీవిగా తేలినట్లుగా వార్తలు వస్తున్నాయి. స్పందించిన బ్యాంకులు సిబిఐని ఆశ్రయించాయి.