బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ పై కేసు నమోదు.. కారణం ఏంటంటే!!
నిత్యం అధికార టీఆర్ఎస్ పార్టీ పై విమర్శలు గుప్పించే బీజేపీ ఫైర్ బ్రాండ్ ధర్మపురి అరవింద్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ను దుర్భాషలాడనని, పరుష పదజాలంతో దూషించను అని నిజామాబాద్ బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రకటన చేసిన తరువాత, ఇప్పుడు తాజాగా ఆయన పై సరూర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ధర్మపురి అరవింద్ పై కేసు నమోదు.. కారణం ఇదే
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావును దుర్భాషలాడడం, రెచ్చగొట్టేలా ప్రసంగం చేశారన్న ఆరోపణలపై నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురిపై సరూర్నగర్ పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. జూలై 13న నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఎంపీ ధర్మపురి అరవింద్ ముఖ్యమంత్రితో పాటు ఇతర గులాబీ పార్టీ నాయకులను దుర్భాషలాడారని పేర్కొంటూ నగరానికి చెందిన న్యాయవాది రవికుమార్ సరూర్నగర్ పోలీసులను ఆశ్రయించారు. ఎంపీ ప్రసంగాన్ని యూట్యూబ్లో చూశానని న్యాయవాది పోలీసులకు ఆ వీడియోను పోలీసులకు ఆధారంగా ఇచ్చారు.
కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు.. అరవింద్ ను టార్గెట్ చేస్తున్న గులాబీ నేతలు
ఫిర్యాదు ఆధారంగా, పోలీసులు అరవింద్ ధర్మపురిపై ఐపిసి సెక్షన్ 504 మరియు 505 (1) (సి) కింద కేసు నమోదు చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ధర్మపురి అరవింద్ ను టిఆర్ఎస్ పార్టీ నేతలు కూడా టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ఇటీవల నాలుగు రోజుల క్రితం ధర్మపురి అరవింద్ కాన్వాయ్ పై రాళ్లతో దాడులకు పాల్పడ్డారు.
గోదావరి ముంపు ప్రాంతాలను సందర్శించడానికి, అక్కడి పరిస్థితులను పరిశీలించడానికి వెళ్లిన ధర్మపురి అరవింద్ ను, గ్రామానికి సంబంధించిన భూ వివాదం పరిష్కరించకుండా ఎందుకు గ్రామానికి వచ్చారు అంటూ నిలదీశారు గ్రామస్తులు.
ఇటీవల ఎంపీ కారుపై రాళ్ళు, కర్రలతో దాడి; టీఆర్ఎస్ నేతల పనే అన్న ఎంపీ
ఎంపీ కాన్వాయ్ పై రాళ్లతో, కర్రలతో దాడి చేశారు.అయితే ఎంపీ అరవింద్ తన పై జరిగిన దాడి గ్రామస్తుల ముసుగులో టీఆర్ఎస్ గుండాలు చేసిన దాడిగా మండిపడ్డారు. స్థానికంగా బిజెపి ప్రజలకు దగ్గరవుతుందని అక్కసుతోనే టిఆర్ఎస్ పార్టీ నేతలు దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు.
ఇక ఇదే సమయంలో తాజాగా ధర్మపురి అరవింద్ పై సీఎం కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిజామాబాద్ లో అరవింద్ ను టార్గెట్ చేస్తున్నారు గులాబీ నేతలు.