కెసిఆర్తో ఖాన్ భేటీ, 50లక్షలు అక్కడ్నుంచేనా? రేవంత్కు నేనివ్వలేదని శ్రీనివాస్
హైదరాబాద్: తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) డిజి ఏకే ఖాన్ మంగళవారం నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును కలిశారు. సాయంత్రం ఆయన సిఎం క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. ఓటుకు నోటు అంశం వారి మధ్య చర్చకు వచ్చిందని తెలుస్తోంది.
రూ.50 లక్షలు అక్కడి నుంచే వచ్చాయా?
ఓటుకు నోటు వ్యవహారంలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ను కొనాలన్న టీడీపీ కుట్రకు శ్రీనివాస్ నాయుడు కంపెనీ నుంచే నగదు సరఫరా జరిగిందన్న కోణంలో ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలుస్తోందని అంటున్నారు.
టీడీపీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య కాల్డేటాతోపాటు లోకేష్ డ్రైవర్ కొండల్ రెడ్డి ఫోన్ డాటాలో శ్రీనివాస్ నాయుడుకు సంబంధించిన ఫోన్ నంబర్లు ఉండటంపై ఏసీబీ ప్రధానంగా దృష్టి సారించింది.
ఈ కుట్రలో నగదు వ్యవహారాన్ని ఛేదించేందుకే శ్రీనివాస్తోపాటు ఆయన అసిస్టెంట్ విష్ణుచైతన్యను విచారించాలని ఏసీబీ నిర్ణయించి నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఆ కోణంలోనే మంగళవారం తమ ఎదుట విచారణకు హాజరైన శ్రీనివాస్ నాయుడును విచారించిందని సమాచారం.
విచారణకు హాజరైన శ్రీనివాస్ నాయుడు
ఓటుకు నోటు కేసులో నోటీసులు అందుకున్న శ్రీనివాస్ నాయుడు మంగళవారం నాడు తెలంగాణ ఎసిబి ఎదుట విచారణకు హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎసిబి అధికారులు అడిగిన ప్రశ్నలన్నింటికి తాను సమాధానం చెప్పానని తెలిపారు. రేవంత్ రెడ్డికి రూ.50 లక్షలు నేనే సమకూర్చానన్నది అవాస్తవమని చెప్పారు.
కాగా, ఓటుకు నోటు కేసులో ఏసిబి సోమవారం ముగ్గురికి నోటీసులు ఇచ్చింది. అందులో బెంగళూరులో ఉంటున్న డికె శ్రీనివాస్, ఆయన కార్యాలయ ఉద్యోగి విష్ణుచైతన్యకు నోటీసులు జారీ చేశారు.
మాజీ ఎంపీ ఆదికేశవులు నాయుడు తనయుడు శ్రీనివాస్. బెంగళూరులోని కర్నాటక బేవరేజస్ అండ్ డిస్టిల్లరీస్కు ఎండీగా వ్యవహరిస్తున్నారు. ఆయన తల్లి డికే సత్యప్రభ చిత్తూరు నియోజకవర్గం టిడిపి ఎమ్మెల్యేగా ఉన్నారు.