మళ్లీ తెరపైకి ఓటుకు నోటు కేసు: మత్తయ్యకు ఏసీబీ నోటీసులు
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనాన్ని సృష్టించిన ఓటుకు నోటు కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఓటుకు నోటు కేసులో విచారణకు హాజరుకావాలని జెరూసలేం మత్తయ్యకు తెలంగాణ ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లో విచారణకు హాజరుకావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు.
ఉప్పల్లోని మత్తయ్య ఇంటికి వెళ్లి ఈ నోటీసులు అందజేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు మత్తయ్యను అరెస్టు చేయబోమని అధికారులు స్పష్టం చేశారు. విచారణకు న్యాయవాదితో కలిసి హాజరుకావొచ్చని పేర్కొన్నారు. ఓటుకు నోటు కేసులో ఏ4 నిందితుడిగా మత్తయ్య ఉన్న విషయం తెలిసిందే.
ఇక ఓటుకు నోటు కేసు విషయానికి వస్తే గతేడాది తెలంగాణ శాసనమండలిలో ఎమ్మెల్సీల ఎన్నికల సందర్భంగా తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు తెలంగాణ టీడీపీ యత్నించింది. ఈ క్రమంలో తెలంగాణ అసెంబ్లీలో నామినేటెడ్ ఎమ్మెల్యేగా ఉన్న స్టీఫెన్సన్ ఓటును కొనుగోలు చేసేందుకు అప్పటి టీ టీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు.
నేరుగా స్టీఫెన్సన్ ఇంటికి వెళ్లిన రేవంత్ రెడ్డి తొలి విడతగా రూ.50 లక్షలను అందజేశారు. దీనిపై ముందస్తు సమాచారం అందుకున్న తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (టీ ఏసీబీ) వెనువెంటనే రంగంలోకి దిగి రేవంత్ రెడ్డిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. కొన్ని నెలలుపాటు జైల్లో ఉన్న ఆయన ఆ తర్వాత బెయిల్ పై విడుదలయ్యారు.
ఈ కేసులో స్టీఫెన్సన్తో ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్లో మాట్లాడారంటూ విడుదలైన ఆడియో టేపులు కలకలం సృష్టించాయి. తమ అనుమతి లేకుండా తెలంగాణ ప్రభుత్వం తమ ఫోన్లను ఎలా ట్యాపింగ్ చేస్తుందంటూ ఏపీ సర్కారు కూడా పలువురు టెలికాం ఆపరేటర్లకు నోటీసులు జారీ చేసి విచారించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో ఇరు రాష్ట్రాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఆ తర్వాత నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి శంకుస్థాపనకు కేసీఆర్కు చంద్రబాబు ఆహ్వానం, కేసీఆర్ హాజరైన నేపథ్యంలో ఈ కేసు దాదాపుగా మరుగున పడింది. అప్పట్లో ఈ కేసులో కేసీఆర్, చంద్రబాబు రాజీకి వచ్చారంటూ విపక్షాలు ధ్వజమెత్తాయి.
తాజాగా మళ్లీ ఈ కేసు తెరపైకి వచ్చింది. గ్రేటర్ ఎన్నికల తర్వాత నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు అధికార పార్టీ టీఆర్ఎస్లో చేరిన నేపథ్యంలో, మరో ఇద్దరినీ తమ పార్టీలో చేర్చుకునేందుకు టీఆర్ఎస్ యత్నిస్తోందన్న ప్రచారం మీడియాలో సాగుతోంది.
ఈ క్రమంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ను కూడా టీఆర్ఎస్ పార్టీలోకి ఆకర్షించే క్రమంలో తెలంగాణ ప్రభుత్వం ఓటుకు నోటు కేసును మళ్లీ తెరపైకి తెచ్చిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. స్టీఫెన్సన్కు రేవంత్ రెడ్డి అందజేసిన నగదును గోపీనాథే సమకూర్చారని, ఈ క్రమంలో ఆయన అరెస్ట్ తప్పదన్న ప్రచారం సాగుతుంది.