జడ్జిపై స్టీఫెన్ ఎత్తు, ఏపీ లాయర్ వేరే రాష్ట్రాలకు వ్యతిరేకంగా వాదించొచ్చు
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో ఏ4 నిందితుడు మత్తయ్య అరెస్టు పైన తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు హైకోర్టు స్టే విధించింది. మరోవైపు, విచారణ నుంచి జడ్జిని తప్పించాలని స్టీఫెన్ సన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ అంశంపై హైకోర్టులో వాదనలు సాగుతున్నాయి.
క్వాష్ పిటిషన్ పైన వివిధ కోర్టుల తీర్పును ఈ సందర్భంగా స్టీఫెన్ సన్ న్యాయవాది ఉదహరిస్తున్నారు.
కాగా, ఓటుకు నోటు కేసులో తాను దాఖలు చేసిన పిటిషన్పై విచారణ నుంచి జస్టిస్ బీ శివశంకర్ రావును తప్పుకోవాలంటూ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్పై నిందితుడు మత్తయ్య హైకోర్టులో బుధవారం కౌంటర్ అఫిడవిట్ను దాఖలు చేసిన విషయం తెలిసిందే.
తన పిటిషన్పై విచారణ నుంచి జస్టిస్ బీ శివశంకర్రావు తప్పుకోవాల్సిన ఆవసరంలేదని, స్టీఫెన్సన్ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ను కొట్టివేయాలని అభ్యర్థించారు. తన పిటిషన్పై ఏపీ రాష్ట్ర అదనపు అడ్వకేట్ జనరల్ కార్యాలయానికి ఎటువంటి సంబంధంలేదని తెలిపారు.
స్టీఫెన్సన్ పిటిషన్ దాఖలు చేయడం వెనుక ఎత్తుగడ ఉందని వివరించారు. న్యాయమూర్తిని తప్పుకోవాలనడం, మరో బెంచ్ ముందుకు తీసుకరావాలనడం న్యాయవాదుల ఎత్తుగడ మాత్రమేనని కౌంటర్లో మత్తయ్య వివరించారు.
సుబ్రతోరాయ్ - సహారా కేసులో సుప్రీం ఇచ్చిన తీర్పును పరిగణలోకి తీసుకొని స్టీఫెన్ పిటిషన్ తోసిపుచ్చాలని కోరారు. జడ్జిలను కేసు విచారణ నుంచి తప్పుకోవాలని కోరుతూ దాఖలయ్యే పిటిషన్లను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని సుప్రీం స్పష్టం చేసిందన్నారు.
18వ తేదీన తన కేసు విచారణ జాబితాలో ఉందని, దాని గురించి ఉదయం పదిన్నర గంటలకు ప్రస్తావించి తగిన సమయంలో విచారణ జరపాలని కోరటం తప్పేమీ కాదన్నారు. ఏపీ ప్రభుత్వ న్యాయవాది ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాదనలు వినిపించకూడదే తప్ప, ఇతర రాష్ట్రాల విషయంలో కాదన్నారు.