ఓటుకు నోటు: 'బాస్' వాయిస్ శాంపిల్ సవాల్, కెసిఆర్-బాబు దోస్తీ ఎంతదాకా?
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపిన ఓటుకు నోటు కేసులో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ముందు ఇప్పుడు పెద్ద టాస్క్ ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ కేసులో సప్లిమెంటరీ ఛార్జీషీట్ దాఖలు చేయడానికి ముందు... ఏపీ సీఎం చంద్రబాబు వాయిస్ శాంపిల్ తీసుకోవడం ఏసీబీకి ఇప్పుడు పెద్ద పని అంటున్నారు.
చంద్రబాబు వాయిస్ శాంపిల్ తీసుకోవడం ఇప్పుడు అతిపెద్ద పని అని ఏసీబీ అధికారులు కూడా భావిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఓటుకు నోటు కేసు కీలక దశకు చేరుకున్న విషయం తెలిసిందే.
వాయిస్ శాంపిల్స్ పరిశీలించిన ఎఫ్ఎస్ఎల్... ఆడియో టేపుల్లోని వాయిస్ టిడిపి నేతలు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, జెరూసలేం మత్తయ్యలవి అని తేల్చినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇక తదుపరి చంద్రబాబు వాయిస్ టెస్ట్ తీసుకోవాల్సి ఉంది.
కాగా, చంద్రబాబు వాయిస్ టెస్ట్ను ఎలా తీసుకుంటారనే అంశం మొదటి నుంచి చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీలో ఆయన మాట్లాడిన ఆడియో రికార్డులు తీసుకోవచ్చునని చెబుతున్నారు. అంతకుముందు చంద్రబాబుకు నోటీసులు జారీ చేసి వాయిస్ శాంపిల్స్ తీసుకోవచ్చునని, ఆయన నిరాకరిస్తే మాత్రం అసెంబ్లీలో, బహిరంగ సభల్లోని ఆయన శాంపిల్ తీసుకుంటారని చెబుతున్నారు.
మరోవైపు, ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ కేసుల అనంతరం చంద్రబాబు, కెసిఆర్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే విధంగా విభేదాలు ముదిరాయి. అయితే, ఆ తర్వాత ఇరువురు కూడా రెండు నెలలుగా ఒకింత స్నేహంగా ఉంటున్నారు. అయితే, ఈ స్నేహం ఎంత వరకు సాగుతుందనేది తెలియాల్సి ఉంది.
నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపనకు చంద్రబాబు.. స్వయంగా కెసిఆర్ ఇంటికి వెళ్లి ఆహ్వానించారు. ఆయన కూడా అమరావతి వెళ్లారు. డిసెంబర్ నెలలో తాను చేసే చండీయాగానికి చంద్రబాబును ఆహ్వానిస్తానని కెసిఆర్ చెప్పారు. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య కొంత స్నేహం ఏర్పడినట్లే కనిపిస్తోంది.
రాజకీయ ప్రత్యర్థులుగా కొనసాగేనా?
కేసులు, చంద్రబాబు - కెసిఆర్ స్నేహం నేపథ్యంలో ప్రజల్లో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ఇరు రాష్ట్రాల అభివృద్ధి కోసం వారి స్నేహం ఇలాగే కొనసాగుతుందా? తెలంగాణలో రాజకీయ ప్రత్యర్థులుగా ఉండటంతో పాటు, విభజన నేపథ్యంలో ఉన్న సమస్యల వల్ల వారు మరింతకాలం స్నేహంగా ఉండటం సాధ్యమేనా అనే చర్చ సాగుతోంది.
తెలంగాణను చంద్రబాబు వదిలేస్తారా?
ఇటీవలి పరిణామాలు వారి స్నేహం మరింత కాలం ఉండేలా కనిపిస్తోందని చెబుతున్నారు. కొద్ది రోజుల క్రితం తెలంగాణ టిడిపి నేతలతో భేటీ అయిన చంద్రబాబు... కెసిఆర్ ప్రభుత్వంపై మీరే పోరాడాలని సూచించినట్లుగా వార్తలు వచ్చాయి.
వరంగల్ ఉప ఎన్నికల ప్రచారానికి వైసిపి అధినేత జగన్ వచ్చారు. చంద్రబాబు మాత్రం రాలేదు. టిడిపి మద్దతిచ్చిన బిజెపి అభ్యర్థి పోటీ చేసినందునే రాలేదని చెబుతున్నారు. అయితే, తెలంగాణలో బలమైన ప్రతిపక్షంగా ఎదగాలనుకుంటే ప్రచారానికి రాకపోయినప్పటికీ.. ఉప ఎన్నికల గురించి ఆయన మాట మాత్రం మాట్లాడలేదని గుర్తు చేస్తున్నారు. దీంతో, చంద్రబాబు తెలంగాణకు నీళ్లు వదిలేశారా అనే చర్చ సాగుతోంది.
అయితే, అది గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తేలుతుందని చాలామంది భావిస్తున్నారు. పొత్తులో భాగంగా వరంగల్ ఉప ఎన్నికల్లో బిజెపికి కేటాయించారు. త్వరలో జిహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. బిజెపి - టిడిపి కలిసి పోటీ చేయొచ్చు. గ్రేటర్ పైన చంద్రబాబు తీరును బట్టి తెలంగాణకు నీళ్లొదిలేశారా లేదా అని తేలుతుందని అంటున్నారు.