ఓటుకు నోటు: చంద్రబాబు ఇంటికి ఎసిబి! రేవంత్ గన్మెన్లతో లోకేష్ డ్రైవర్...
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో ఎసిబి అధికారులు దర్యాఫ్తును వేగవంతం చేస్తున్నారు. టిడిపి అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసానికి, టిడిపి కార్యాలయానికి తెలంగాణ ఎసిబి కానిస్టేబుళ్లు ఇద్దరు వెళ్లినట్లుగా సమాచారం.
మంగళవారం నాడు రాత్రి ఎనిమిదిన్నర గంటలకు కానిస్టేబుళ్లు చంద్రబాబు ఇంటికి వెళ్లారని వార్తలు వస్తున్నాయి. అలాగే టిడిపి కార్యాలయానికి కూడా వెళ్లారని సమాచారం.
చంద్రబాబు తనయుడు, టిడిపి సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేష్ కాన్వాయ్లోని డ్రైవర్ కొండల్ రెడ్డిని విచారించేందుకు వారు వెళ్లారని సమాచారం. అయితే, కొండల్ రెడ్డి అక్కడ లేడని తేలడంతో వారు వెళ్లిపోయారని తెలుస్తోంది.
ఓటుకు నోటు కేసులో డబ్బులు చేతలు మారడం వెనుక కొండల్ రెడ్డి హస్తమున్నట్టు ఏసీబీ భావిస్తోందని సమాచారం. అయితే, కొండల్ రెడ్డి కోసం చంద్రబాబు ఇంటికి ఏసీబీ కానిస్టేబుళ్లు వెళ్లారనే వార్త ఒకింత కలవరం రేపింది.
కొండల్ రెడ్డి కోసం వారు తొలుత టీడీపీ పార్టీ కార్యాలయానికి కూడా ఏసీబీ అధికారులు వెళ్లారు. అతను అక్కడ లేకపోవడంతోనే చంద్రబాబు ఇంటి వద్దకు వెళ్లినట్టుగా తెలుస్తోంది. నేడో రేపో కొండల్ రెడ్డి ఇంటికెళ్లి విచారణకు నోటీసులు ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు.
కాగా, కొండల్ రెడ్డి రెండు ఫోన్లు వాడేవాడని వార్తలు వస్తున్నాయి. వాటిని లోకేష్ కూడా ఉపయోగించి ఉంటారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొండల్ రెడ్డి ఫోన్ నుంచి రేవంత్ గన్మెన్లకు తరుచూ ఫోన్లు వెళ్లాయని చెబుతున్నారు. ఇప్పుడు కొండల్ రెడ్డిని విచారించేందుకు ఎసిబి సమాయత్తమవడం గమనార్హం.