చంద్రబాబును చూస్తే నవ్వొస్తోంది, జాలేస్తోంది: హరీష్
సిద్ధిపేట: తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అడుగడుగునా తెలంగాణకు అన్యాయం చేసేందుకు కుట్రలు పన్నాడని, వాటికి తగిన మూల్యం చెల్లించాల్సిందేనని తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. సోమవారం మెదక్ జిల్లా సిద్దిపేటలోని ఎన్జీవో భవన్లో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.
చంద్రబాబును చూస్తే నవ్వొస్తోంది.. జాలి వేస్తోందని ఆయన అన్నారు. తాను తీసిన గోతిలో తానే పడ్డాడని, ఇది నగ్న సత్యమని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డికి సంబంధించిన ఓటుకు నోటు వ్యవహారాన్ని చంద్రబాబు మసిపూసి మారేడు కాయ చేస్తున్నాడని, తెలంగాణ ప్రభుత్వంపై గొంతు చించుకుని అరిస్టే నమ్మే స్థితిలో ప్రజలు లేరని ఆయన అన్నారు.
‘నాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్నావు. నేడు తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నావు' అని చంద్రబాబుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు తెలంగాణ ప్రజలకు ఆయన క్షమాపణ చెప్పాల్సిందేనన్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబు దమ్ముంటే సీఎం పదవికి రాజీనామా చేసి నిజాయితీ నిరుపించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
తన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు అనేక ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎప్పటికీ న్యాయమే గెలుస్తుందని, అన్యాయం చేసిన వారికి శిక్ష పడాల్సిందేనని అన్నారు. కుట్రలు చేసి, వాళ్లు తవ్వుకున్న గోతిలో వారే పడ్డారని ఆయన అన్నారు. తెలంగాణకు రావాల్సిన నీటి వాటా రాకుండా అడ్డు తగులుతున్నాడని ఆయన మండిపడ్డారు.
పరిశ్రమలు రాకుండా అడ్డుపడిన నీచ సంస్కృతి చంద్రబాబుదన్నారు. తెలంగాణ ఏర్పడితే విద్యుత్ ఉండదని, నీళ్లు దొరకవని చంద్రబాబు కలలు కన్నారని, కానీ, వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ ఒక్క నిమిషమూ కరెంటు పోకుండా సరఫరా చేయడం తెలంగాణ ప్రభుత్వం సాధించిన గొప్ప విజయమన్నారు. రెండు రాష్ట్రాల ప్రజల దృష్టిని మళ్లించేందుకు చంద్రబాబు ప్రయత్నించడం సరి కాదని ఆయన అన్నారు. రేవంత్ ఉదంతాన్ని తెలంగాణ ప్రభుత్వ కుట్రగా అభివర్ణిస్తూ గగ్గోలు పెట్టడం దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుగా ఉందని ఆయన అన్నారు.
గోదావరి జలాలను సిద్దిపేటకు తెప్పించి త్వరలో లక్ష ఎకరాలకు కాల్వల ద్వారా సాగు నీరు అందిస్తామని హరీశ్రావు చెప్పారు. నంగునూరు మండలం ముండ్రాయి, రాజగోపాల్పేట, మగ్ధుంపూర్ గ్రామాల్లో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.
సిద్దిపేట నియోజకవర్గంలోని తడకపల్లిలో రిజర్వాయర్ నిర్మించి కాల్వల ద్వారా సాగు నీరు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. భూగర్భ జలాలు పెంచేందుకు మిషన్కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. త్వరలో పొద్దంతా రైతులుసాగు చేసుకునేందుకు 9 గంటల త్రీఫేజ్ విద్యుత్ సరఫరా చేస్తామన్నారు.