హైదరాబాద్ లో సీబీఐ కీలక అరెస్ట్ - రాజకీయ కలకలం..!!
సీబీఐ అరెస్ట్ లు హైదరాబాద్ కేంద్రంగా ప్రకంపలనకు కారణమవుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కాంలో హైదరాబాద్ లో ఒకరిని సీబీఐ అరెస్ట్ చేసింది. ఇప్పటికే ఇదే కేసుకు సంబంధించి అటు సీబీఐ..ఇటు ఈడీ వరుసగా సోదాలు చేయటం.. నోటీసులు ఇవ్వటం కలకలానికి కారణమైంద. రాజకీయంగా పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. ఇప్పుడు హైదరాబాద్ కు చెందిన బోయినపల్లి అభిషేక్ రావు ను సీబీఐ అరెస్ట్ చేసింది. అభిషేక్ రావు అరెస్ట్ ను సీబీఐ అధికారికంగా నిర్దారించింది. ఈ రోజున కోర్టులో హాజరు పర్చనుంది.

అభిషేక్ అరెస్ట్ - కోర్టు ముందుకు
హైదరాబాద్ కు చెందిన కొందరికి ఢిల్లీ లిక్కర్ స్కాంతో సంబంధాలు ఉన్నట్లుగా సీబీఐ - ఈడీ విచారణలో తేలింది. ఇప్పటికే దీనికి సంబంధించి సీబీఐ పలువురి పైన అభియోగాలు నమోదు చేసింది. నగరానికి చెందిన రామచంద్ర పిళ్లైకు ఈ కేసులోని ఇతరులతో సంబంధాలు ఉన్నట్లుగా నిర్దారణకు వచ్చారు. దిల్లీలో అరెస్టుచేసిన ఇద్దరికి రామచంద్ర పిళ్లైతో సంబంధం ఉందని ఎఫ్ఐఆర్లో సీబీఐ పేర్కొనడంతో తదుపరి చర్యలు హైదరాబాద్లో ఉంటాయని భావించారు. ఇప్పుడు అందులో భాగంగానే రామచంద్రన్ పిళ్లైకు చెందిన రాబిన్ డిస్టలరీలో డైరెక్టర్ గా ఉన్న బోయినపల్లి అభిషేక్ రావును సీబీఐ అరెస్ట్ చేసింది. ఆయన్ను ఢిల్లీకి తరలిస్తున్నారు. రామచంద్రన్ పిళ్లైతో కలిసి అభిషేక్ రావు తొమ్మది కంపెనీల్లో భాగస్వామిగా ఉన్నట్లు సీబీఐ గుర్తించింది.

హైదరాబాద్ టు ఢిల్లీకి ముడుపులు
ఢిల్లీ లిక్కర్ వ్యవహారంలో రూ 2.3 కోట్లు వసూలు చేసి ఢిల్లీ కేంద్రంగా కొందరు పెద్దలకు అందించినట్లుగా సీబీఐ అభియోగాలు నమోదు చేసింది. హైదరాబాద్ లో అనూస్ బ్యూటీ పార్లర్ కేంద్రంగా అభిషేక్ రావు తన వ్యాపార లావాదేవీలు నిర్వహించినట్లుగా విచారణ అధికారులు తేల్చారు. లిక్కర్ స్కాంలో ఇప్పటికే విజయ్ నాయర్ ను అరెస్ట్ చేసిన సీబీఐ ఇప్పుడు అభిషేక్ రావు ది రెండో అరెస్ట్. మచ్లౌడర్ సంస్థ సీఈఓ, ఆప్కమ్యూనికేషన్స్ ఇంఛార్జి విజయ్నాయర్ను సీబీఐ అరెస్టు చేయగా.. ఇండోస్పిరిట్ ఎండీ సమీర్ మహేంద్రును ఈడీ అధికారులు.. దిల్లీలో అరెస్టు చేశారు. విజయ్నాయర్ తరఫున మహేంద్రు 2 నుంచి 4 కోట్లను దిల్లీఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా అనుచరుడు అర్జున్పాండేకు అందించారని సీబీఐ అభియోగం. ఆ డబ్బులో కొంత రామచంద్ర పిళ్లైదని అనుమానిస్తున్నారు.

సీబీఐ నెక్స్ట్ టార్గెట్ పై ఉత్కంఠ
లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న హైదరాబాద్కు చెందిన సంస్థలన్నీ కొందరు ప్రముఖుల కుటుంబసభ్యులు, బంధుమిత్రుల పేర్లతో ఉన్నట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించినట్లు సమాచారం. ఇక, ఇప్పుడు అభిషేక్ రావు అరెస్ట్ తో మరి కొందరు ప్రముఖులకు సంబంధించి విచారణ సంస్థలు ముందుకు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో హైదరాబాద్ కేంద్రంగా సాగుతన్న సోదాలు.. విచారణలు..ఇప్పుడు అరెస్ట్ లతో రానున్న రోజుల్లో ఈ వ్యవహారంలో ప్రముఖులు ఎవరు చిక్కుకుంటారనే ఉత్కంఠ కొనసాగుతోంది. రాజకీయంగా వస్తున్న ఆరోపణలతో ఈ వ్యవహారం పొలిటికల్ టర్న్ తీసుకుంటోంది. సీబీఐ రానున్న రోజుల్లో ఏం చేయబోతుందనేది ఉత్కంఠను పెంచుతోంది.












Click it and Unblock the Notifications