కీలక పరిణామం: జగన్ అక్రమాస్తుల కేసులో మెమో దాఖలు చేసిన సిబిఐ
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రతి శుక్రవారం జగన్ కేసుపై విచారణ చేపట్టాలని సిబిఐ కోర్టు నిర్ణయించింది. కాగా, ట్రయల్స్ త్వరగా ప్రారంభించాలని అభ్యర్థిస్తూ శుక్రవారం కోర్టులో సిబిఐ మెమో దాఖలు చేసింది.
జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి ఇప్పటి వరకు సిబిఐ దాఖలు చేసిన అన్ని చార్జిషీట్లపై ట్రయల్స్ వెంటనే ప్రారంభించాలని.. ఇటీవల హైకోర్టు ఒక ఉత్తర్వు జారీ చేసిందని సిబిఐ పేర్కొంది.
ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు, ఎంపీలు మంత్రులు.. వాళ్లకు సంబంధించిన కేసులు ఉంటే వాటిపై ట్రయల్స్ వెంటనే ప్రారంభించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందని సిబిఐ పేర్కొంటూ ఆ ఆదేశాల ప్రతిని మెమోతో పాటు జత చేసి సిబిఐ కోర్టుకు అందజేశారు.
సీనియార్టీని పరిగణనలోకి తీసుకోవడం లేదు: హైకోర్టులో ఫిర్యాదు
పోలీస్ శాఖలో సీనియార్టీని పరిగణనలోనికి తీసుకోవడం లేదని రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన 25 మంది ఎస్పీ, డీఎస్పీలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన హైకోర్టు ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలంటూ రెండు రాష్ట్రాల్లోని సంబంధిత డిపార్ట్మెంట్లకు, కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై విచారణను కోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది.