ధర్మాన్ని పాటిస్తేనే సమాజంలో శాంతి: గీతాజయంతి వేడుకలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
హైదరాబాద్: భారతీయ జీవన విధానమైన ఆధ్యాత్మికత, శాంతి, సహనం వీటికి దూరమవుతున్న కొద్దీ సమాజంలో అలజడి అసహనం ఎక్కువ అవుతుందన్నారు సీబీఐ విశ్రాంత జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ అన్నారు. హైదరాబాద్ నగరంలోని చిక్కడపల్లి లోని త్యాగరాయ గాన సభలో మంగళవారం ఉదయం 'భగవద్గీతా ఫౌండేషన్' నిర్వహణ 'గీతాజయంతి మహోత్సవం' వేడుక ఆద్యంతం గీతా బంధువుల సమక్షంలో వైభవంగా జరిగింది.

గీత స్మరణతో ఆడిటోరియం పులకించింది. ఈ వేడుకలో ముఖ్య అతిధిగా పాల్గొన్న లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. భగవత్ గీత మనకు మార్గనిర్దేశనం చేస్తుందని వివరించారు. ఎవరి వృత్తి పనిలో వారు ధర్మబద్ధంగా ఉంటే సమాజంలో శాంతి నెలకొంటుందని లక్ష్మీ నారాయణ అన్నారు. నేడు ప్రతిరోజు నేర పూరిత వార్తలతో దిన పత్రికలు నిండుతున్నాయని ఇందుకు కారణం జాతి తన ధర్మాన్ని కోల్పోతున్న సందర్భమని అన్నారు.

కాగా, వేదికపై అతిధులు అందరూ సంయుక్తంగా ప్రపంచపు తొలి ఆంగ్ల సంగీత భరిత భగవద్గీత ఆడియో పోస్టర్ను ఆవిష్కరించారు. గోవింద పీఠం పీఠాధిపతి పూజ్యశ్రీ శ్రీరామ ప్రియ స్వామి మాట్లాడుతూ.. అధికారులు, నాయకులు, స్వామీజీలు ప్రోటోకాల్తో జన సామాన్యానికి దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భగవద్గీత ఎవరి కర్తవ్యాన్ని వారు పాటించాలని సందేశాన్ని ఇచ్చిందని, గంగాధర్ శాస్త్రి మనసా వాచా కర్మణా గీత సారాన్ని పాటిస్తూ ప్రచారం చేస్తున్నారని అభినందించారు.
గాన సభ అధ్యక్షులు కళా జనార్ధన మూర్తి మాట్లాడుతూ.. సినీ జర్నలిస్ట్గా అపర ఘంటసాలగా ఒకనాడు పేరు గడించిన గంగాధర్ శాస్త్రి గీత ఫౌండేషన్ స్థాపించి జీవితమంతా గీతాప్రచారంకు అంకితంకావటం విశేషమని కొనియాడారు. ఈ సందర్భంగా వై. రామకృష్ణకు గీతాచార్య పురస్కారం, జి. నాగ అనిష్కకు పార్ధ పురస్కారం, కలగ అచ్యుతశర్మకు గీత బాల మేధావి పురస్కారం అతిథులు బహుకరించారు. అనంతరం భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎల్. వి. గంగాధర శాస్త్రి కృష్ణ భజన, గీతామృతంను మధుర గళంతో గానం చేస్తూ స్ఫూర్తి వంతగా వ్యాఖ్యానం చేశారు. గీతా సందేశంను అందించారు. కార్యక్రమానికి ముందు త్యాగరాయ గానసభ ఆవరణలో గోపూజ నిర్వహించారు. క్రాంతి నారాయణ్ ప్రదర్శించిన శ్రీకృష్ణ నృత్యం ఆహుతులను అలరించింది.












Click it and Unblock the Notifications