కేసీఆర్ను సీబీఐ విచారించాలి, ప్రగతిభవన్లో దాడులు జరిగితేనే..: రేవంత్ డిమాండ్
హైదరాబాద్: కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ సర్కారుపై విమర్శలు గుప్పించారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర గురించి ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. దేశ సమగ్రతను కాపాడటం కోసమే భారత్ జోడో యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
జోడో యాత్ర కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు సాగుతుందని రేవంత్ వెల్లడించారు. ఇక బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలపై విమర్శలు గుప్పిస్తూ.. బ్రిటీష్ కాలం నాటి పరిస్థితులు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయన్నారు రేవంత్. జైళ్లలో నిర్బంధిస్తున్నారని చెప్పారు. దేశ ప్రజలపై బీజేపీ దాడి చేస్తోందని ఆరోపించారు.

లిక్కర్ స్కాంలో కల్వకుంట్ల కవిత ఉన్నారని బీజేపీ నేతలే చెబుతున్నారని.. అయితే, ఆధారాలు దొరకాలంటే ప్రగతి భవన్లో సోదాలు జరగాలని రేవంత్ అన్నారు. ప్రగతిభవన్ మాఫియాకు అడ్డాగా మారిందని ధ్వజమెత్తారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలు, ఎంపీల ఆర్థిక స్థితిగతులపై సీబీఐతో విచారణ జరిపించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
గతంలో అరవింద్ కేజ్రీవాల్ను ఢిల్లీలో సీఎం కేసీఆర్ కలిశారని.. లిక్కర్ స్కాంకు కర్త, కర్మ, క్రియ కేసీఆరేనని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ ను సీబీఐ ప్రశ్నించాలని ఆయన డిమాండ్ చేశారు.
మరోవైపు, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా కేసీఆర్ కుటుంబంపై మండిపడ్డారు. తన కొడుకు, కుమార్తెపై వస్తోన్న అవినీతి ఆరోపణలతో ముఖ్యమంత్రి కేసీఆర్ భయపడుతున్నారన్నారు. ఇబ్రహీంపట్నం కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల ఘటనలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిని బాధ్యుడిని చేయాలని డిమాండ్ చేశారు. మంత్రిని బర్తరఫ్ చేయాలన్నారు. కనీసం మహిళా డాక్టర్ను పెట్టకుండా శస్త్ర చికిత్సలు చేయటం దారుణమని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications