తెలంగాణాలో ధాన్యం సేకరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్; అవకతవకలపై తెలంగాణాకు ఆడిట్ బృందాలు
తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం సేకరణకు సంబంధించి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సంచలన ప్రకటన చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తో కలిసి మీడియాతో మాట్లాడిన పీయూష్ గోయల్ ధాన్యం సేకరణ పై ఎఫ్సిఐ కి కేంద్రం క్లియరెన్స్ ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇక ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి సహకరించడం లేదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ విమర్శించారు.

కేవలం రాజకీయ అజెండాతో కేంద్రంపై నిందలు
తెలంగాణ ప్రభుత్వం తీరు వల్లే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ మిల్లుల్లో నిల్వ సౌకర్యాలు సరిగా లేవని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మండిపడ్డారు. కావాలని తెలంగాణ ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లపై రాజకీయం చేస్తోందని పీయూష్ గోయల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో టీఆర్ఎస్ పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు మంచిది కాదంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు. కేవలం రాజకీయ అజెండాతో తెలంగాణ ప్రభుత్వం కేంద్రంపై నిందలు వేసేందుకు ప్రయత్నిస్తోందని పీయూష్ గోయల్ ఆరోపించారు.

రాజకీయాలపై కేసీఆర్ కు ఉన్న శ్రద్ధ ప్రజలపై లేదు
తెలంగాణ సీఎం కేసీఆర్ కు రాజకీయాలపై ఉన్న శ్రద్ధ ప్రజలపై లేదని ఆయన మండిపడ్డారు. తాము ఎన్నిసార్లు లేఖలు రాసిన తెలంగాణ ప్రభుత్వం స్పందించలేదని పీయూష్ గోయల్ విమర్శించారు. ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులపై టిఆర్ఎస్ నేతల విమర్శలు బాధాకరమని ఆయన వ్యాఖ్యానించారు. తమకు వ్యతిరేకంగా మాట్లాడితే ఒరిగే లాభం ఏమీ లేదని పీయూష్ గోయల్ తెలంగాణ సీఎం కేసీఆర్ కు చురకలంటించారు. ధాన్యం సేకరణ పై అవకతవకలు జరిగాయని తెలంగాణకు ఆడిట్ బృందాలను పంపిస్తామని పీయూష్ గోయల్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఒక ఫెయిల్యూర్ ప్రభుత్వమని ఆయన మండిపడ్డారు. దేశంలో 80 కోట్ల మందికి నెలకు 5 కిలోల చొప్పున అదనపు బియ్యం ఇస్తున్న ప్రభుత్వం కేంద్రప్రభుత్వమని, కానీ పేదలకు అందాల్సిన సాయంపై తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి చీకూచింతా లేదని విమర్శించారు.

ఎఫ్సీఐ ద్వారా ధాన్యం కొనాలని నిర్ణయం తీసుకున్నాం
ఇక ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణ ప్రభుత్వ తీరుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో రైతుల పరిస్థితిని రైసుమిల్లర్ల పరిస్థితిని కేంద్ర ప్రభుత్వానికి వివరించామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. నేరుగా ఎఫ్సీఐ ద్వారా ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నామని కిషన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రప్రభుత్వ తీరుతోనే రైతులు నష్టపోతున్నారని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని సమస్యలు,తెలంగాణ రాష్ట్రంలోనే ఎందుకు వస్తున్నాయని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.

కేసీఆర్ ఢిల్లీలో ధర్నాలు ఎందుకు చేశారో
కెసిఆర్ ఢిల్లీలో ధర్నాలు ఎందుకు చేశారో ఇప్పటికీ అర్థం కావడం లేదని, కెసిఆర్ కు రైతుల పట్ల ఎటువంటి ప్రేమ లేదని కిషన్ రెడ్డి ఆరోపించారు. అన్ని పోషకాలు ఉన్న ప్రోటీన్ రైస్ ను కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఏ విషయంలోనైనా తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని ఎవరికీ భయపడేది లేదని, ఎక్కడికి పారిపోయేది లేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. మొత్తానికి కేంద్రం తీసుకున్న నిర్ణయంతో తెలంగాణా ధాన్యం కొనుగోళ్ళ వివాదానికి తెర పడినట్టేనా అన్నది తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications