కేంద్రం గెజిట్ పై రచ్చ : తెలంగాణాకు లాభమన్న బీజేపీ .. నష్టమన్న టీఆర్ఎస్ ; డైలమాలో ఏపీ !!
తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలను కేంద్రం అడ్వాంటేజ్ గా తీసుకుందా? అదును చూసి రెండు రాష్ట్రాలకు కోలుకోలేని దెబ్బ కొట్టిందా? కృష్ణా గోదావరి నదీ జలాల బోర్డుల పరిధి ఖరారు చేస్తూ విడుదల చేసిన గెజిట్ వల్ల ఏ రాష్ట్రానికి మేలు జరుగుతుంది? ఏ రాష్ట్రానికి నష్టం జరుగుతుంది? అన్న చర్చ జోరుగా సాగుతోంది. ప్రస్తుతం గందరగోళంగా తయారైన ఈ వివాదం రెండు తెలుగు రాష్ట్రాల లోనూ హాట్ టాపిక్ గా మారింది. ఇక ఇదే సమయంలో తెలంగాణలో బీజేపీ , టీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది.
నదీజలాలపై కేంద్రానికి పూర్తి అజమాయిషీ.. తెలుగురాష్ట్రాల పంచాయితీకి చెక్
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య చిలికి చిలికి గాలివానగా మారిన జల వివాదానికి కేంద్రం చెక్ పెట్టింది. నదీజలాల పంపకాల వ్యవహారం, సర్వ హక్కులు కేంద్రం గుప్పిట్లోకి వెళ్ళిపోయాయి. కృష్ణా గోదావరి బేసిన్ లను మొత్తంగా కేంద్రం తన ప్రత్యక్ష అధికార పరిధిలోకి తీసుకొస్తూ గెజిట్ జారీచేసింది. ఈ గెజిట్ ప్రకారం కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ అధికార పరిధి అక్టోబర్ 14 2021 నుండి మొదలవుతుందని పేర్కొన్నారు. ఇక ప్రాజెక్టులకు సంబంధించి, నీటి వాటా లకు సంబంధించి, జల వివాదాలకు సంబంధించి ఏ నిర్ణయం అయినా సరే కేంద్రానిదే తుది నిర్ణయమని అంటే నదీజలాలపై కేంద్రానికి పూర్తి అజమాయిషీ ఉంటుందని గెజిట్ నోటిఫికేషన్ ద్వారా స్పష్టం చేశారు.
తెలంగాణాకు కేంద్రం గెజిట్ తో లాభమా ? నష్టమా
ఉమ్మడి ప్రాజెక్టులు అయిన శ్రీశైలం, నాగార్జునసాగర్ తో సహా అన్నింటి నిర్వహణ కేంద్రం పరిధిలోకి వెళ్లనున్న నేపథ్యంలో, ఈ గెజిట్ నోటిఫికేషన్ వల్ల తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఇక దీనిపై చర్చించటానికి ఢిల్లీ వెళ్లాలని, న్యాయపోరాటం సైతం చేయాలని కెసిఆర్ భావిస్తుంటే, కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల తెలంగాణ రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని బిజెపి నేత, మాజీ మంత్రి డీకే అరుణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పోతిరెడ్డిపాడు విస్తరణ పనులు, రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆపేస్తారన్న డీకే అరుణ
కృష్ణా జలాల వినియోగంలో ఇన్నాళ్ళూ తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని పేర్కొన్న బిజెపి జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో కుమ్మక్కు అయిన సీఎం కేసీఆర్ దక్షిణ తెలంగాణ ప్రయోజనాలను విస్మరించారని మండిపడ్డారు. కృష్ణా గోదావరి నదీ జలాలకు సంబంధించి బోర్డుల పరిధి ఖరారు చేస్తూ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ ను తెలంగాణ బీజేపీ స్వాగతిస్తున్నదని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్రమంగా నిర్మిస్తున్న పోతిరెడ్డిపాడు విస్తరణ పనులు, రాయలసీమ ఎత్తిపోతల పథకం కృష్ణా నది యాజమాన్య బోర్డు నిలిపి వేస్తుందని డీకే అరుణ పేర్కొన్నారు.
టీఆర్ఎస్ నేతలు ఏదేదో మాట్లాడుతున్నారని డీకే అరుణ తీవ్ర ఆగ్రహం
ఇదే సమయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయంతో తెలంగాణ రాష్ట్రానికి మేలు జరుగుతుంటే టీఆర్ఎస్ నేతలు ఏదేదో మాట్లాడుతున్నారని డీకే అరుణ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. విభజన చట్టం ప్రకారమే బోర్డులో పరిధిని కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది అని పేర్కొన్న ఆమె, ఈ నిర్ణయంతో తెలంగాణ రాష్ట్రానికి మేలు జరుగుతుందని స్పష్టం చేశారు. ఒకపక్క అధికార పార్టీ నష్టం జరుగుతుందని గగ్గోలు పెడుతుంటే, తెలంగాణ బిజెపి నేతలు లాభం జరుగుతుందని చెప్పడం గమనార్హం. కేంద్రం నిర్ణయం తెలంగాణా రాష్ట్రానికి లాభం చేకూరుస్తుందా? నష్టం చేస్తుందా అన్న మీమాంస ప్రస్తుతం ప్రజల్లో కనిపిస్తుంది.
డైలమాలో ఏపీ.. గెజిట్ ను స్వాగతిస్తున్నామని చెప్తూనే సంశయంలో
ఇక అసలు విషయానికి వస్తే కేంద్రం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ ఏపీకి అన్యాయం జరుగుతుందని అనుమానాలు వ్యక్తం అవుతున్న వేళ స్వాగతిస్తున్నామని సైలెంట్ గా అధికార వైసీపీ ప్రకటనలు చేస్తుంది. కానీ దిగువన ఉన్న ఏపీకి కేంద్రం తాజా నిర్ణయంతో అన్యాయం జరిగే అవకాశం ఉంది. తెలంగాణకు లాభం జరుగుతుందని బిజెపి నేతలు చెబుతున్నప్పటికీ, తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని సీఎం కేసీఆర్ కేంద్రంపై న్యాయపోరాటానికి దిగడానికి రెడీ అవుతున్నారు.
అదును చూసి దెబ్బ కొట్టిన కేంద్రం ..యుద్ధం చేస్తాం అంటున్న టీఆర్ఎస్
నీటి కోసం రాజ్యాలే కూలిపోయాయని కేంద్రంపై నిప్పులు చెరుగుతున్నారు. రాష్ట్ర హక్కులను కాలరాస్తున్నట్టుగా తెలంగాణా ఈ గెజిట్ ను భావిస్తుంది. కానీ ఏపీ మాత్రం కక్కలేక మింగలేక అన్న చందంగా డైలమా లో పడిపోయింది. ఏది ఏమైనా పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చిన చందంగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాన్ని ఆసరాగా చేసుకుని కేంద్రం రెండు రాష్ట్రాలలో ఇరిగేషన్ పై పూర్తి ఆధిపత్యం చలాయించడానికి ప్రయత్నిస్తుందని, అదును చూసి రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు చెక్ పెట్టిందని జల నిపుణులు భావిస్తున్నారు.