తెలంగాణను తొక్కిపెట్టిన కేంద్రం?
తెలంగాణను కేంద్రం తొక్కిపెట్టిందా? అనే ప్రశ్నకు అవుననే సమాధానం వస్తోంది. కొత్త ఆర్థిక సంవత్సరం వచ్చినప్పటికీ అప్పులు చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అనుమతివ్వడంలేదు. మరోవైపు ఆంధ్రప్రదేశ్కు మాత్రం అప్పులు చేసుకోవడానికి అనుమతి మంజూరు చేస్తోంది. అప్పులు చేయడానికి రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతివ్వకపోవడంద్వారా వాటిని తన గుప్పిట్లో పెట్టుకుందని భావిస్తున్నారు.
గత నెలలో ఏపీ ప్రభుత్వం రూ.11వేల కోట్లు అప్పు చేయడానికి కేంద్రం అనుమతిచ్చింది. అదే తెలంగాణ అధికారులు ఢిల్లీలో ఉన్నతాధికారులను కలిసి తమ లెక్కలన్నీ పారదర్శకంగా ఉన్నాయని, అప్పు ఎందుకు చేయాల్సి వస్తుందో అన్ని వివరాలు తెలియజేసినప్పటికీ స్పందన రాలేదు. బీజేపీకి, టీఆర్ఎస్ కు తెలంగాణ రాజకీయ వైరం నడుస్తోంది. ఇరువైపులా నేతలు మాటల తూటాలు పేలుస్తున్నారు. అప్పు పుట్టని పరిస్థితి తెలంగాణకు తీసుకురాగలిగితే సంక్షేమంవైపు, అభివృద్ధివైపు చేయాల్సిన పనులన్నీ ఆగిపోయి ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోందని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు.
ఆ వ్యతిరేకత రాబోయే ఎన్నికల్లో తమకు కలిసొస్తుందని భావిస్తున్నారు. ఏపీలో లోపాయికారీగా సహకరిస్తున్న ప్రభుత్వం ఉంది కాబట్టి నిబంధనలు పాటించకుండా కేంద్రం అనుమతి మంజూరు చేస్తోందని తెలంగాణ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. అదే తెలంగాణ దగ్గరకు వచ్చేసరికి నిబంధనలంటూ కాలయాపన చేస్తున్నారని మండిపడుతున్నారు. అధికారులు అప్పు ఎందుకు చేయాలో పారదర్శకంగా లెక్కలు వివరించినప్పటికీ కేంద్రం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో ఇరు పార్టీల మధ్య రాజకీయ వైరుధ్యం తీవ్రంగా పెరుగుతోంది. ఈ వివాదం చిలికి చిలికి గాలివానలా మారే ప్రమాదం కనపడుతోంది.