మోడీతో రేవంత్ భేటీ ఎఫెక్ట్: తెలంగాణకు కేంద్రం గుడ్న్యూస్
Mamnoor Airport:కేంద్రంలోని మోడీ సర్కారు తెలంగాణకు మరో శుభవార్త అందించింది. దశాబ్దాల కాలంగా ఎదురుచూస్తున్న మామునూరు(వరంగల్) ఎయిర్ పోర్టుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు శుక్రవారం కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల ఢిల్లీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కలిసిన అనంతరం ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం.
ప్రధాని మోడీతో సమావేశమైన సీఎం రేవంత్.. మెట్రోతోపాటు తెలంగాణలో ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న పలు ప్రాజెక్టుల గురించి వివరించారు. ఈ నేపథ్యంలోనే చాలా కాలంగా పెండింగ్లో ఉన్న మామునూరు విమానాశ్రయంకు కేంద్రం నుంచి అనుమతులు రావడం గమనార్హం.

ఇక, మామునూరు ఎయిర్ పోర్టుకు మోడీ సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం పట్ల తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికే మామునూరు విమానాశ్రయం భూసేకరణ కోసం రూ. 205 కోట్లు విడుదల చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మామునూరు ఎయిర్ పోర్ట్ విస్తరణకు అవసరమైన 253 ఎకరాల భూసేకరణ కోసం రూ. 205 కోట్లను రేవంత్ సర్కారు విడుదల చేసింది.
ఇప్పటికే ఎయిర్ పోర్ట్ పరిధిలో 696 ఎకరాల భూమి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కొత్తగా సేకరించే 253 ఎకరాల భూమిని రన్ వే విస్తరణకు, నెవిగేషనల్ ఇన్స్ట్రూమెంట్ ఇన్స్టాలేషన్ విభాగాల కోసం నిర్మాణాలకు, ఏటీసీ, టెర్మినల్ బిల్డింగ్ కోసం వినియోగించనున్నారు.
వరంగల్ జిల్లాలోని గాడిపల్లి, గుంటూరుపల్లి, నక్కలపల్లి గ్రామాల నుంచి భూమిని సేకరించనున్నారు. విమానాశ్రయం ఏర్పాటుకు తమ విలువైన భూములు ఇస్తున్న రైతులకు మార్కెట్ విలువ ప్రకారం పరిహారం చెల్లిస్తామని మంత్రి కొండా సురేఖ హామీ ఇచ్చారు. భూమి కోల్పోతున్న 233 మంది రైతులు, ప్లాట్ల యజమానుతో చర్చించి వారి అభిప్రాయాల మేరకు వేరే చోట భూమి కేటాయిస్తామని మంత్రి తెలిపారు. అంతేగాక, రైతులు కోరిన విధంగా మౌలిక సదుపాయాలైన రహదారులు, డ్రైనేజీ, విద్యుత్, ఇతర సదుపాయాలను కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications