కేసీఆర్ కు ఎక్కడ అడ్డుపడ్డానో చెప్పాలి.. ట్విట్టర్ వేదికగా చంద్రబాబు డిమాండ్
హైదరాబాద్ : ఇద్దరు చంద్రుల మధ్య వివాదం మళ్లీ ముదురుపాకన పడింది. అటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఇటు టీఆర్ఎస్ అధినేత చంద్రశేఖర్ రావు ఒకరిపై మరొకరు మాటల దాడులు చేస్తూ తెలంగాణ ఎన్నికల రణరంగం వేడేక్కిస్తున్నారు. కాంగ్రెస్ తో అనైతిక పొత్తులు పెట్టుకున్న చంద్రబాబుకు ఇక్కడేం పనంటూ కేసీఆర్ నిలదీస్తున్నారు. తెలంగాణ అభివృద్ధికి బాబు అడ్డుపడుతున్నారంటూ తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు.
అదలావుంటే కేసీఆర్ కు తాను ఎక్కడ అడ్డుపడ్డానో చెప్పాలంటూ చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. బాబు తాజా వ్యాఖ్యలతో ఎలక్షన్ హీట్ మరింత పెరుగుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి.

నేను అడ్డుపడ్డానా..! ఎక్కడ, ఎలా?
ట్విట్టర్ వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గులాబీ అధినేత కేసీఆర్ కు ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణ అభివృద్ధికి తాను ఏవిధంగా అడ్డుపడుతున్నానో కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు చంద్రబాబు నాయుడు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తానంటే అడ్డుపడ్డానా? దళితుడ్ని సీఎం చేస్తానంటే అడ్డుపడ్డానా? అంటూ సూటిగా ప్రశ్నించారు. ఇలా పదేపదే తాను తాను అడ్డుపడుతున్నానంటూ కేసీఆర్ వ్యాఖ్యానించడం సరికాదన్నారు. నాలుగున్నరేళ్ల పదవీకాలంలో ఘనంగా చెప్పుకునేలా కేసీఆర్ ఒక్క పనైనా చేశారా అంటూ సవాల్ విసిరారు. ఏమీ లేకుండా, ఏమీ చేయకుండా హైదరాబాద్ ను అన్నివిధాలా అభవృద్ధి చేసిన తనపై ఇలాంటి ఆరోపణలు చేయడమేంటో అర్థం కావడం లేదని పేర్కొన్నారు.
పనిలో పనిగా ప్రధాని మోడీపై సెటైర్లు విసిరారు. నాలుగున్నరేళ్ల కాలంలో అచ్చేదిన్ ఎక్కడా కనిపించలేదని ఎద్దేవా చేశారు. రానున్న పార్లమెంటరీ ఎన్నికల్లో బీజేపీని చిత్తుగా ఓడిస్తే.. తప్పకుండా అచ్చేదిన్ వస్తుందని అభిప్రాయపడ్డారు.
బాబే అస్త్రం..! కేసీఆర్ ప్రచారం
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు టార్గెట్ గా ప్రచారంలో దూసుకెళుతున్నారు టీఆర్ఎస్ బాస్ కేసీఆర్. సైద్ధాంతిక విభేదాలు సైతం పక్కనబెట్టి కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు పెట్టుకోవడం దేనికి సంకేతమని మండిపడుతున్నారు. చంద్రబాబుకు అదీ లేదు ఇదీ లేదంటూ రాయలేని పదజాలంతో దూషిస్తున్నారు. అటు కేసీఆర్ తనయుడు కేటీఆర్ కూడా ప్రత్యక్షంగానే చంద్రబాబుకు హెచ్చరికలు జారీచేస్తున్నారు. తెలంగాణలో మీరు వేలు పెడితే.. ఆంధ్ర ఎన్నికల రంగంలోకి తాము దిగుతామంటూ వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తానికి తెలంగాణలో ఎన్నికల వేళ కాంగ్రెస్ తో బాబు జతకట్టడం టీఆర్ఎస్ నేతలకు సుతారం ఇష్టం లేదనే విషయం స్పష్టమవుతోంది.
సైకిల్ వర్సెస్ కారు.. హీటెక్కిన రణరంగం
ఇద్దరు చంద్రుల మాటల కోట్లాటతో తెలంగాణ ఎన్నికల రణరంగం హీటెక్కింది. అటు చంద్రబాబుపై కేసీఆర్ ఆరోపణాస్త్రాలు.. వాటికి కౌంటర్ గా బాబు వ్యాఖ్యలు ప్రచార పర్వాన్ని మరింత వేడేక్కిస్తున్నాయి. దీంతో వీరిద్దరి పంచాయితీని ఫాలో అవుతున్నవారు ఒకరినొకరు గెలుక్కోడమే తప్ప ఎలాంటి ఉపయోగం లేదంటున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఓటుకు నోటు కేసు ప్రాధాన్యత సంతరించుకున్న విషయం అందరికీ తెలిసిందే. దాని తర్వాత కొన్ని వేదికలపై ఈ ఇద్దరూ కలిసిపోయారన్నట్లుగా సీన్ క్రియేటయింది. మళ్లీ ఈ ఎన్నికల వేళ ఇరువురి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా తయారయింది పరిస్థితి.












Click it and Unblock the Notifications