బాబు తప్పించుకోలేరు: హరీష్, ఎపి సిఎంపై టిఆర్ఎస్ ఎదురుదాడి
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేసు నుంచి బయటపడటానికి నానా తంటాలు పడుతున్నారని తెలంగాణ మంత్రి హరీష్రావు అన్నారు. ఏం చేసినా చంద్రబాబు తన తప్పును కప్పి పుచ్చుకోలేరని ఆయన శనివారంనాడు అన్నారు. చంద్రబాబు తెలంగాణ ప్రజలను, తెలంగాణ మీడియాను మేనేజ్ చేయలేరని తెలిపారు. చంద్రబాబు నాయుడు ఎన్ని కుట్రలు చేసినా చట్టం నుంచి తప్పించుకోలేరని అన్నారు.
టీ న్యూస్ ఛానల్కు ఏపీ పోలీసులు నోటీసులు ఇవ్వడం వెనుక చంద్రబాబు నాయుడు కుట్ర ఉందని తెలంగాణకు చెందిన మరో మంత్రి పద్మారావు ఆరోపించారు. టీ న్యూస్కు ఏపీ పోలీసులు నోటీసులు ఇవ్వడంపై ఆయన శనివారంనాడు తీవ్రంగా స్పందించారు. ఓటుకు నోటు కేసులో ప్రధాన సూత్రధారి చంద్రబాబేనని స్పష్టం చేశారు. చట్ట విరుద్దంగా టీ న్యూస్కు నోటీసులు ఇచ్చిన ఏపీ పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
టీ న్యూస్కే ఏపీ పోలీసులు నోటీసులు ఇవ్వడం మీడియాకు ప్రమాదకర సంకేతాలని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) బూర నర్సయ్య గౌడ్ అన్నారు. మిగతా మీడియా కూడా దీనిపై స్పందించాలని డిమాండ్ చేశారు.

ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం చంద్రబాబుకు ఉన్న అన్ని దారులు మూసుకుపోయాయని టిఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి అన్నారు. టీ న్యూస్ ఛానల్కు ఏపీ పోలీసులు నోటీసులు ఇవ్వడంపై ఆయన స్పందించారు. చంద్రబాబుకు ఇక మిగిలింది జైలు దారేనని, జర్నలిస్టుల సంఘాలతో కలిసి తాము కూడా పోరాడుతమని చెప్పారు.
ఓటుకు నోటు వ్యవహారంలో బయటకు వచ్చిన ఆడియో టేపుల్లో ఏపీ సీఎం చంద్రబాబు తన వాయిస్ కాదని ఎందుకు ప్రకటించటంలేదని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్గుప్త అన్నారు. టీ న్యూస్ ఛానల్కు ఏపీ పోలీసుల నోటీసులపై ఆయన స్పందిస్తూ... స్టీఫెన్సన్కు డబ్బులు ఇస్తూ రేవంత్రెడ్డి రెడ్హ్యాండెడ్గా దొరికిపోయాడని అన్నారు.
తిమ్మిని బమ్మి చేయాలని చంద్రబాబు చూస్తున్నారని, అందుకే టీ న్యూస్కు నోటీసులు ఇచ్చారని అన్నారు. అర్థరాత్రి టీ న్యూస్కు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు. తెలుగు ప్రజల మధ్య వైషమ్యాలు పెంచేందుకే బాబు కుట్రలు పన్నుతున్నారని, చంద్రబాబు వైఖరిని తెలంగాణ సమాజం వ్యతిరేకిస్తుందని ఆయన అన్నారు. కేసు నుంచి తప్పించుకునే క్రమంలో చంద్రబాబు మతిభ్రమించి ప్రవర్తిస్తున్నారని గణేష్ గుప్త అన్నారు.












Click it and Unblock the Notifications