నోటుకు ఓటు కేసు: అందుకే ఎపికి ప్రత్యేక హోదాపై చంద్రబాబు రాజీ?
న్యూఢిల్లీ: తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) పెట్టిన ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజీ పడ్డారా అనే ప్రశ్న ఉదయిస్తోంది. అవునని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు అంటున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఢిల్లీలో చేపట్టిన ధర్నా కార్యక్రమంలో ఓటుకు నోటు కేసు ప్రధానంగా ముందుకు వచ్చింది.
ఎపికి ప్రత్యేక హోదా కోరుతూ జగన్ సోమవారంనాడు ఢిల్లీలో ధర్నా చేపట్టిన విషయం తెలిసిందే. ధర్నా కార్యక్రమంలో ప్రసంగించిన పార్టీ నాయకులు ఓటుకు నోటు కేసును ప్రస్తావించి చంద్రబాబుపై ఆరోపణాస్త్తాలు సంధించారు. వైయస్ జగన్ కూడా ఆ అంశాన్ని ప్రస్తావించారు.
తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి ఎసిబికి అడ్డంగా దొరికిపోయారని, ఆ స్థితిలో ఆ కేసు నుంచి బయటపడడానికి చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీతో రాజీ పడ్డారని, అందుకే ప్రత్యేక హోదాపై పట్టుబట్టడం లేదని జగన్ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు తమ్మినేని సీతారాంతో సహా తదితరులు ఓటుకు నోటు కేసును ప్రస్తావించి, అందుకే చంద్రబాబు ప్రత్యేక హోదాపై రాజీ పడ్డారని విమర్శించారు. తనపై ఉన్న కేసులు బయటపడుతాయనే భయంతో చంద్రబాబు రాజీ పడుతున్నారని జగన్ ఆరోపించారు.
నోటుకు ఓటు కేసులో తెలంగాణ ఎసిబి చంద్రబాబు నాయుడిని కూడా ప్రశ్నించేందుకు సమన్లు జారీ చేస్తుందని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే, ఓటు నోటు కేసులో దర్యాప్తు మందగించినట్లు కనిపిస్తోంది. అయితే, ఈ కేసుపై వెనక్కి తగ్గేది లేదని ఎసిబి అధికారులు అంటున్నారు.












Click it and Unblock the Notifications