కాంగ్రెస్ పునాదులు కూలిపోయాయి, ఆ ఓట్లపైనే తెరాస: చంద్రబాబు అంచనా
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తమ పార్టీ తగినన్ని సీట్లు గెలుచుకోగలదనే ధీమాను తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యక్తం చేశారు. ఆయన శనివారం తెలంగాణ పార్టీ నాయకులతో సమావేశమయ్యారు.
గ్రేటర్ హైదరాబాదు పరిధిలో కాంగ్రెసు పని అయిపోయిందని, దాని పునాదులు కూడా కూలిపోయాయని, ఆ ఓట్ల మీదనే తెరాస ఆశలు పెట్టుకుందని ఆయన అన్నారు. హైదరాబాద్లో టిడిపి ఇంకా బలంగానే ఉందని ఆయన చెప్పారు.
శాసనసభ ఎన్నికల ఫలితాలే గ్రేటర్ హైదరాబాదు పరిధిలోనూ పునరావృతమవుతాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. గ్రేటర్ హైదరాబాదు పరిధిలో తెరాసపై వ్యతిరేకత ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. గ్రేటర్ హైదరాబాదు పరిధిలో శానససభ ఎన్నికల్లో బిజెపి, టిడిపి 14 సీట్లు గెలుచుకున్నాయి. అయితే, పలువురు టిడిపి శాసనభ్యులు తెరాసలో చేరిపోయారు.
గ్రేటర్ హైదరాబాదు పరిధిలో చంద్రబాబు నాయుడు గురు, శుక్రవారాల్లో టిడిపి, బిజెపి కూటమి అభ్యర్థుల కోసం ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే.