తెలంగాణాలో చంద్రబాబు అదిరిపోయే ప్లాన్.. ముఖ్యనేతలతో భేటీలో సంచలన నిర్ణయం!
తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు రంగంలోకి దిగారు. నేడు హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్ వేదికగా పార్టీ ముఖ్య నేతలతో కీలక సమావేశం నిర్వహించిన చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీని క్షేత్రస్థాయి నుండి బలోపేతం చేయాలని నిర్ణయించిన ఆయన తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అవసరాన్ని పార్టీ నేతలతో చర్చించారు.
తెలంగాణా టీడీపీ కమిటీలు రద్దు చేసిన చంద్రబాబు
ఇక ఇదే సమయంలో చంద్రబాబు తెలంగాణ రాష్ట్రంలోని పార్టీ జిల్లా, మండల కమిటీలు అన్నింటినీ రద్దు చేశారు. తెలంగాణ రాష్ట్ర టిడిపి అధ్యక్షుడిగా త్వరలోనే ఒక కీలకమైన వ్యక్తికి బాధ్యతలు అప్పగిస్తున్నట్టు, అలాగే నూతన కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో ఇంకా టిడిపి అభిమానులు ఉన్నారని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా పార్టీ పైన అభిమానంతో పని చేసేవారు ఉన్నారని నేతలతో మాట్లాడారు చంద్రబాబు.

పార్టీ శ్రేణులకు సభ్యత్వాలపై చంద్రబాబు దిశానిర్దేశం
ముందు అందరూ సభ్యత్వాలపై ఫోకస్ చేయాలని ముఖ్య నేతలకు సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో స్థానికసంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని చంద్రబాబు పార్టీశ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఎవరైతే పార్టీలో ఎక్కువ సభ్యత్వాలు చేస్తారో వారికి పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో టిడిపిని బలోపేతం చేయడం కోసం ఇకపై ప్రతి నెలలో రెండు రోజులు రాష్ట్రానికి వస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు.
రెండు రాష్ట్రాలు రెండు కళ్ళలాంటివి
పార్టీలో పనితీరు బాగున్న వారికే ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. తనకు రెండు రాష్ట్రాలు రెండు కళ్ళలాంటివని, రెండు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలన్నది తెలుగుదేశం పార్టీ అభిమతమని చంద్రబాబు పేర్కొన్నారు. పార్టీ నుంచి నేతలు వెళ్లిపోయారు కానీ గ్రామాలలో ఇంకా తెలుగుదేశం పార్టీకి బలమైన కేడర్ ఉందని చంద్రబాబు చెప్పారు. క్యాడర్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నేతలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
కొత్త కమిటీలు ఏర్పాటు చెయ్యనున్న చంద్రబాబు
ఇక తెలుగుదేశం పార్టీని తెలంగాణలో ముందుకు నడిపించే కొత్త అధ్యక్షుడు ఎంపిక పైన కూడా ఈ సమావేశంలో పార్టీ నేతలతో చర్చించనున్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి గతంలోనే కీలక నిర్ణయాలు తీసుకున్న చంద్రబాబు పాత కమిటీలు మొత్తాన్ని రద్దుచేసి కొత్త కమిటీలను ఏర్పాటు చేయనున్నారు.
ఏపీలో టీడీపీ క్యాడర్ లా తెలంగాణాలోనూ పని చెయ్యండి .. చంద్రబాబు పిలుపు
ఏపీ తెలంగాణలో ఒకేసారి కొత్త కమిటీలను ఏర్పాటు చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన తెలుగుదేశం శ్రేణులను గుర్తు చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో కూడా పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీని ప్రజలు కచ్చితంగా ఆదరిస్తారని చంద్రబాబు వెల్లడించారు












Click it and Unblock the Notifications