బాబు పాఠం!: రాధాకృష్ణతోనూ కెసిఆర్కు ప్యాచప్, రేవంత్ రెడ్డి దూరమేనా?
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖర రావుల మధ్య సయోధ్య కుదిరింది! అమరావతికి కెసిఆర్కు చంద్రబాబు నుంచి ఆహ్వానం రాగా, తెలంగాణ సీఎం చేస్తున్న చండీయాగానికి ఏపీ సీఎంకు ఆహ్వానం అందింది.
ఈ నేపథ్యంలో ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య ప్యాచప్ అయిందని చాలామంది భావిస్తున్నారు. అదే సమయంలో కెసిఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెరాస ప్రభుత్వానికి ఉప్పు నిప్పులా మారిన... ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణకు కూడా కెసిఆర్ స్వయంగా ఫోన్ చేశారు.
చండీయాగానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. రాధాకృష్ణకు చెందిన ఆంధ్రజ్యోతి పత్రికలో నిత్యం టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని దనుమాడుతూ కథనాలు వచ్చాయి. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ తెలంగాణలో నిషేధానికి గురయింది. దీని వెనుక టిఆర్ఎస్ ప్రభుత్వం ఉందని ఆరోపణలు ఉన్నాయి.
కెసిఆర్కు బద్ద వ్యతిరేకులైన చంద్రబాబు, రాధాకృష్ణలకు చండీయాగానికి ఆహ్వానం అందింది. వారి మధ్య ప్యాచప్ అయిందని చెబుతున్నారు. అదే సమయంలో టిడిపి యువనేత రేవంత్ రెడ్డి మాత్రం ఒంటరి అయిపోయారనే వాదనలు వినిపిస్తున్నాయి.
కాగా, చంద్రబాబు శనివారం తెలంగాణ టిడిపి నేతలతో మాట్లాడుతూ... ప్రభుత్వాలు వేరు, పార్టీలు వేరు అని చెప్పారు. ప్రభుత్వాలుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిసి పని చేయవలసి ఉంటుందని చెప్పారు. అదే సమయంలో తెలంగాణలో తెలుగుదేశం మాత్రం టిఆర్ఎస్కు రాజకీయ ప్రత్యర్థిగానే ఉంటుందని తెలిపారు.
పాలనా పరంగా రెండు రాష్ట్రాలు కలిసి పని చేయాల్సి ఉందని, అదే సమయంలో టిఆర్ఎస్తో రాజకీయ విభేదాలు మాత్రం ఉంటాయని చంద్రబాబు స్పష్టం చేశారు. టిడిపి శ్రేణులు, నేతలను కాపాడుకోవాలన్నారు. పరిపాలనా పరంగా తెలంగాణ, ఏపీలు కలిసి పని చేస్తాయని, కేసిఆర్తో నేను సమన్వయం చేసుకోవాల్సి ఉంటుందన్నారు.