తెలుగు రాష్ట్రాలు మళ్లీ కలుస్తాయా?: చంద్రబాబు కీలక వ్యాఖ్యలు, మాజీలకు పిలుపు
ఖమ్మం: తెలుగుదేశవం పార్టీ ఎక్కడ అనే వారికి ఇవాళ ఖమ్మంలో తెలుగు తమ్ముళ్ల ఉత్సాహమే సమాధానం అని అన్నారు ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కూడా బలంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఖమ్మంలోని సర్దార్ పటేల్ మైదానంలో ఏర్పాటు చేసిన టీడీపీ శంఖారావం సభలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. భారీ ఎత్తును టీడీపీ, చంద్రబాబు అభిమానులు తరలివచ్చారు.
తెలుగు రాష్ట్రాలు మళ్లీ కలవవంటూ చంద్రబాబు తేల్చేశారు
ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ.. రెండు రాష్ట్రాలు అయ్యాయి కాబట్టి కొందరు చేతకాని వ్యక్తులు మాట్లాడుతున్నారు. మళ్లీ రెండు రాష్ట్రాలను కలిపేస్తారంట. బుద్ధి, జ్ఞానం ఉండేవాళ్లు ఎవరూ ఇలాంటి వ్యాఖ్యలు చేయరు అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తెలుగు ప్రజలు తనకు ఎన్నో అవకాశాలిచ్చారన్నారు. తొమ్మిదేళ్లు ఉమ్మడి ఆంద్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఎవరూ లేరు. పదేళ్లు ప్రతిపక్ష నేతగా ఉండటం కూడా రికార్డే. రాబోయే రోజుల్లో నా రికార్డును ఎవరూ బద్దలు కొట్టలేరు. ఎందుకంటే రెండు రాష్ట్రాలు మళ్లీ కలవవు అని చంద్రబాబు తేల్చి చెప్పారు.
తెలంగాణలో మాజీ టీడీపీ నేతలకు చంద్రబాబు పిలుపు
తనను 40 ఏళ్లు ఆశీర్వదించిన తెలుగు జాతి కోసం జీవితాంతం పనిచేస్తానన్నారు. ఏపీలో గాడి తప్పిన పాలనను మళ్లీ గాడిలో పెట్టి వారిని ఆదుకునే బాధ్యత తనదేనని అన్నారు. తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తామన్నారు. జ్ఞానేశ్వర్ లాంటి నాయకులను అభివృద్ధి చేసి టీడీపీ ఆశయాలను ముందకు తీసుకెళ్లామన్నారు. తెలంగాణలో ఓటు అడిగే హక్కు టీడీపీకే ఉందన్నారు చంద్రబాబు. తాను ఫౌండేషన్ వేయకపోతే హైదరాబాద్ ఇంత అభివృద్ధి అయ్యేదా? అని ప్రశ్నించారు. టీటీడీపీని క్రియాశీలకంగా చేయాలని కోరుతున్నట్లు తెలిపారు. వివిధ పార్టీలోకి వెళ్లిన నేతలు తిరిగి రావాలని ఆహ్వానించారు చంద్రబాబు.
టీడీపీ అవసరం అనుకున్న వాళ్లు మళ్లీ పార్టీలోకి రావాలన్నారు. నాయకత్వం అండగా ఉంటుందన్నారు.
ఏపీ కంటే తెలంగాణలోనే ఎక్కువ అభిమానం కనిపిస్తోందన్న బాబు
ఏపీ కంటే తనకు తెలంగాణలోనే ఎక్కువ అభిమానం కనిపిస్తోందని అన్నారు చంద్రబాబు. తనకు అధికారం ముఖ్యం కాదని.. ప్రజల అభిమానమే ముఖ్యమని అన్నారు. చాలా సార్లు ఖమ్మం వచ్చాను కానీ.. ఈరోజు హైదరాబాద్ నుంచి ఖమ్మం వరకు నా జీవితంలో ఎప్పుడూ చూడని ఉత్సాహం చూశాను. మీరంతా స్వచ్ఛందంగా వచ్చారు. యువత వీరోచితంగా ముందుకు వచ్చారు. నేను కోరుకునేది అధికారం కాదు.. మీ అభిమానం. తెలుగువారు ఎక్కడ ఉన్నా.. మీ అభిమానం కోరుకుంటున్నా. మీ ఆత్మబంధువుగా ఉండాలని కోరుకుంటున్నా.. అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లో తెలంగాణ గడ్డనపైనే టీడీపీ ఆవిర్భవించిందన్నారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అని చంద్రబాబు కీర్తించారు.
ఏపీలో విధ్వంసం జరుగుతోందంటూ చంద్రబాబు ఫైర్
తన ప్రసంగంలో చంద్రబాబు నాయుడు.. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపైనా విరుచుకుపడ్డారు. తెలంగాణలో తన విజన్ను తన తరువాత ముఖ్యమంత్రులు అనుసరిస్తే..ఏపీలో మాత్రం ఇప్పటి సీఎం విధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం ఏపీలో ఎక్కడ చూసినా విధ్వం సమే కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వరదల్లో భద్రాచలం మునగకుండాకరకట్ట ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. విడిపోయినా రెండు రాష్ట్రా లు కలిసి అభివృద్ధి చేసుకోవాలని.. అభివృద్ధిలోద్ధి తెలుగు రాష్ట్రా లు అగ్రస్థానంలో ఉండాలనే తాను కోరుకుంటున్నా నని చంద్రబాబు స్పస్టం చేశారు.